కంచుకోటలో కారు బోల్తా.. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బొక్కబోర్లా

కంచుకోటలో కారు బోల్తా.. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బొక్కబోర్లా
  • 2018లో 38.. ఇప్పుడు కేవలం 11 సీట్లు
  • దక్షిణ తెలంగాణలోనూ సగానికి తగ్గిన స్థానాలు
  • 2018లో 50 వస్తే ఇప్పుడు 28కి పరిమితం
  • ఉత్తరాన కారు బోల్తా..దక్షిణ తెలంగాణలోనూ సగానికి తగ్గిన స్థానాలు

హైదరాబాద్/కరీంనగర్, వెలుగు :  కంచుకోటలో కారు బోల్తా కొట్టింది. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్​ బొక్కబోర్లా పడింది. దక్షిణ తెలంగాణలోనూ దాదాపు సగం స్థానాలను కోల్పోయింది. కేసీఆర్​ టీడీపీని వీడి తెలంగాణ ఉద్యమ జెండా పట్టిన నాటి నుంచి ఉత్తర తెలంగాణ.. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ ​జిల్లా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచింది. నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్​ జిల్లాల్లోనూ ఆ పార్టీకి గట్టి పట్టుంది. 2004 నుంచి అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ ఈ జిల్లాలు బీఆర్ఎస్​ను అక్కున చేర్చుకున్నాయి. 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్​ జిల్లాలను బీఆర్ఎస్​ స్వీప్ ​చేసింది. కరీంనగర్, వరంగల్ ​జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున సీట్లు సాధించింది. కానీ ఈసారి ఆ జిల్లాల్లోనే బీఆర్ఎస్​కు ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర తెలంగాణ (కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్)లో 2018లో 38 సీట్లు సాధించిన బీఆర్ఎస్.. ఈసారి ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోయింది. ఇక దక్షిణ తెలంగాణ(ఖమ్మం, నల్గొండ, మహబూబ్​ నగర్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి)లో 2018లో 50 సీట్లు సాధించగా.. ఈసారి 28 సీట్లకే పరిమితమైంది. 

సిట్టింగులను మార్చిన చోట సానుకూలం.. 

సిట్టింగ్​ఎమ్మెల్యేలను మార్చి కొత్త వాళ్లకు టికెట్లు ఇచ్చిన స్థానాల్లో బీఆర్ఎస్​కు సానుకూల ఫలితాలు వచ్చాయి. నర్సాపూర్​లో మాణిక్​రావుకు బదులు సునీతా లక్ష్మారెడ్డికి, జనగామలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి బదులు పల్లా రాజేశ్వర్​రెడ్డికి, స్టేషన్​ ఘన్​పూర్​లో రాజయ్యకు బదులు కడియం శ్రీహరికి, బోథ్​లో రాథోడ్​ బాపురావుకు బదులు అనిల్​ జాదవ్, అలంపూర్​లో అబ్రహంకు బదులు విజేయుడుకు, ఆసిఫాబాద్​లో ఆత్రం సక్కుకు బదులు కోవ లక్ష్మీకి, ఉప్పల్​లో భేతి సుభాశ్​ రెడ్డికి బదులు బండారి లక్ష్మారెడ్డికి టికెట్లు ఇవ్వడంతో వాళ్లు విజయం సాధించారు. కోరుట్లలో విద్యాసాగర్​రావుకు బదులు ఆయన కుమారుడు సంజయ్​కు టికెట్​ఇవ్వగా ఆయన గెలుపొందారు. కంటోన్మెంట్​నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న  కుమార్తె లాస్య నందితకు టికెట్​ఇవ్వగా ఆమె విజయం సాధించారు. వేములవాడలో చెన్నమనేని రమేశ్​కు బదులు చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు, ఖానాపూర్​లో రేఖా నాయక్​కు బదులు జాన్సన్​ నాయక్​కు టికెట్​ఇవ్వగా వారిద్దరు మాత్రం ఓడిపోయారు. అభ్యర్థులను మార్చిన చోట 80 శాతం సానుకూల ఫలితాలు వచ్చాయని, ఈ లెక్కన 30 మంది అభ్యర్థులను మార్చి ఉంటే అధికారానికి బీఆర్ఎస్​ చేరువయ్యేదనే అంచనాలు పార్టీలో ఉన్నాయి.

అన్ని జిల్లాల్లో భారీగా తగ్గిన సీట్లు.. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లాలో 14 సీట్లకు 13 చోట్ల బీఆర్ఎస్​ అభ్యర్థులు గెలిచారు. ఈసారి అక్కడ అలంపూర్, గద్వాల స్థానాలకే బీఆర్ఎస్​ పరిమితం కావాల్సి వచ్చింది. దేవరకద్రలో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోగా, మిగతా స్థానాలను కాంగ్రెస్​ఏకపక్షంగా గెలుచుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు ఉండగా 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 చోట్ల గెలిచింది. కానీ ఈసారి ఒక్క సూర్యాపేట స్థానానికే పరిమితమైంది. మిగతా 11 చోట్ల కాంగ్రెస్ ​భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఉమ్మడి వరంగల్​ జిల్లాలో 12 సీట్లకు గాను గత ఎన్నికల్లో 10 చోట్ల గెలిచిన బీఆర్ఎస్.. ఈసారి స్టేషన్​ ఘన్​పూర్, జనగామలో మాత్రమే విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్​జిల్లాలో 13 స్థానాలుండగా గత ఎన్నికల్లో 11 చోట్ల బీఆర్ఎస్​ గెలిచింది. ఈసారి సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్, హుజూరాబాద్​లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కేసీఆర్ ​సొంత జిల్లా మెదక్​లో నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, పటాన్​చెరు స్థానాల్లో బీఆర్ఎస్​ క్యాండిడేట్లు గెలిచారు. గ్రేటర్​ హైదరాబాద్​లోని ఎంఐఎం సిట్టింగ్​ స్థానాలు మినహా మిగతా సీట్లను బీఆర్ఎస్ ​స్వీప్​ చేసింది.