గంగాధర, వెలుగు: బీఆర్ఎస్ ఓ వైరస్ అని.. బీజేపీ దానికి వ్యాక్సిన్ అని.. ఏది కావాలో ప్రజలే తేల్చుకుంటారని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ అన్నారు. పాదయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేటలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులను పట్టించుకోవడం లేదని, కొండగట్టు బస్సు ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలను ఆదుకోలేదని మండిపడ్డారు.
డ్రగ్స్ వ్యవహారంలో పైలట్ రోహిత్రెడ్డి ప్రమేయం త్వరలోనే బయటపడుతుందన్నారు. బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసును వదిలే ప్రసక్తే లేదని, ఈ వ్యవహారం మీద రీఎంక్వైరీ చేయాలన్నారు. కొంతమంది ఎమ్మెల్యేల తప్పుల చిట్టాను దగ్గర పెట్టుకొని సీఎం వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. కేసీఆర్ పతనం మొదలైందని, బీఆర్ఎస్ ఆఫీసుకు వేసిన పెయింట్ ఆరకముందే ఆ పార్టీ వీఆర్ఎస్ అవుతుందన్నారు.