
15 ఏళ్ల క్రితం కరీంనగర్ కు వచ్చినప్పుడు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. కేసీఆర్ సాధించిన వ్యవసాయ ప్రగతితో రైతులు ఇక్కడ రెండు పంటలు పండిస్తుంటే ఏపీలో క్రాప్ హాలిడే ప్రకటించారని ఆరోపించారు. భవిష్యత్తులో తెలంగాణ మోడల్ ను ఏపీలో కూడా అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.
ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మృతి చెందారు. ఈ మేరకు ఇవాళ బీఆర్ఎస్ నేత తోట చంద్రశేఖర్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డిలు కరీంనగర్ లో మంత్రి గంగులను కలిసి పరామర్శించారు. పితృవియోగంతో బాధపడుతున్న మంత్రి గంగుల కమలాకర్ కు తోట చంద్రశేఖర్ తన సంతాపం తెలియజేశారు. గంగుల మల్లయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు.