కవితపై సైలెంట్.. లిక్కర్​ స్కామ్​పై నోరెత్తని గులాబీ లీడర్లు

కవితపై సైలెంట్..   లిక్కర్​ స్కామ్​పై నోరెత్తని గులాబీ లీడర్లు
  • బిడ్డ అరెస్టయి నెలరోజులైనా స్పందించని కేసీఆర్​
  • కనీసం పరామర్శకు కూడా ఢిల్లీకి వెళ్లలే 
  • మొదట్లో నేతల హడావుడి.. ఇప్పుడు గప్​చుప్​
  • లోక్ సభ ఎన్నికల్లో నెగెటివ్ అవుతుందనేనా?
  • బీఆర్ఎస్​లో అంతర్గత చర్చ

హైదరాబాద్, వెలుగు:  కల్వకుంట్ల కవిత అరెస్టు అంశం బీఆర్​ఎస్​ పార్టీలో క్రమంగా సైలెంట్​ మోడ్​లోకి వెళ్లిపోయింది. మార్చి 15న ఆమెను హైదరాబాద్​లో ఈడీ అరెస్టు చేసినప్పుడు హడావుడి చేసిన గులాబీ నేతలంతా  ఇప్పుడు గప్​చుప్​ అయ్యారు. ఆమె వెంట నడిచిన లీడర్లు కూడా.. ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు. అరెస్టు అక్రమమని,  ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎట్ల అరెస్టు చేస్తారంటూ ఈడీ ఆఫీసర్లతో అప్పట్లో వాగ్వాదానికి దిగిన కవిత అన్న కేటీఆర్.. అరెస్టు సమయంలో పరుగుపరుగున వచ్చిన మేనబావ హరీశ్ రావు ఇప్పుడు కవిత విషయమే మాట్లాడడం లేదు. ఇక, బీఆర్​ఎస్​ బాస్​, మాజీ సీఎం కేసీఆర్​ అయితే బిడ్డ అరెస్టయినప్పటి నుంచి స్పందించలేదు. ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్లి ఆమెను పరామర్శించలేదు. 

అరెస్టు అక్రమమని చెప్పినోళ్ల ఫోకసంతా కొన్నిరోజులుగా కేవలం పార్లమెంట్​ ఎన్నికలపైనే పడింది. రాజకీయ వేదికలపై కూడా మాటమాత్రానికి కూడా కవిత అంశాన్ని ఎవరూ ప్రస్తావించడం లేదు. లిక్కర్ స్కామ్​ కేసును ప్రస్తావిస్తే నెగెటివ్ అవుతుందనే మాట్లాడటం లేదా..? అన్న చర్చ గులాబీ పార్టీలో అంతర్గతంగా సాగుతున్నది. దాదాపు అన్ని ఎంపీ సెగ్మెంట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ లో నిర్వహించిన సభకు సాక్షాత్తూ మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆరే హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. కానీ, బిడ్డ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఈడీ కస్టడీలో కవిత ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లిన మాజీ మంత్రి స్వయానా ఆమె మేనబావ హరీశ్ రావు, సోదరుడు కేటీఆర్ అక్కడే రెండుమూడు రోజులుండి పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చారు. మధ్యలో ఓ సారి తల్లి శోభమ్మతో కలిసి ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ కవితను పరామర్శించారు. తర్వాత మళ్లీ వెళ్లలేదు. పార్టీ  కార్యక్రమాల్లో కేటీఆర్, హరీశ్ రావు బిజీ అయిపోయారు. 

ఢిల్లీ వెళ్లని కేసీఆర్

ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి దాదాపు నెల రోజులు అవుతున్నది. తన కూతురు కవితను పరామర్శించేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లలేదు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన.. కృష్ణా జలాలపై నల్గొండలో నిర్వహించిన సభకు వెళ్లారు. కరీంనగర్ లో వినోద్ కుమార్ కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల మీటింగులకు హాజరయ్యారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించారు. శనివారం సాయంత్రం చేవెళ్ల మీటింగ్​కు కూడా హాజరయ్యారు. కానీ.. ఢిల్లీ వెళ్లే ప్రయత్నం చేయలేదు. సొంత బిడ్డను కేసీఆర్​ పరామర్శించకపోవడం గులాబీ పార్టీ శ్రేణుల్లోనే చర్చకు దారితీసింది. బిడ్డ అంశాన్ని మీడియా వద్దగానీ, అటు బహిరంగ సభల్లో కానీ కేసీఆర్​ ప్రస్తావించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడికే ఆయన ప్రయారిటీ ఇస్తున్నారు.

ఎన్నికల్లో నెగెటివ్ అవుతుందని భయమా?

కవిత పేరును ప్రస్తావిస్తే లోక్ సభ ఎన్నికల్లో నెగెటివ్ అవుతుందని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు భయపడుతున్నారా..? అనే చర్చ గులాబీ కేడర్​లో కొనసాగుతున్నది. పైగా పార్టీలోని ఇతర కీలక నేతలు కూడా ఈ అంశంపై నోరెత్తడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో కవితే సూత్రధారి అంటూ గురువారం కస్టడీ అప్లికేషన్​లో సీబీఐ  ప్రస్తావించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు మూడు రోజుల కస్టడీకి ఆమెను అప్పగించింది. మొన్నటి వరకు ఈడీ కస్టడీ, ఇప్పుడు సీబీఐ కస్టడీలోకి కవిత వెళ్లడంతో బీఆర్ఎస్ అగ్రనాయకులు అయోమయంలో పడిపోయారు. దీనిపై ఎట్ల స్పందించినా సమస్య వస్తుందని, మౌనంగా ఉండటమే మంచిదని వాళ్లు భావిస్తున్నట్లు పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి.