- తెలంగాణ భవన్లోనే పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
- సీఎం ఇల్లు, మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి ప్రయత్నాలు.. అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఆదివారం హంగామా చేశారు. రాష్ట్రవ్యాప్త నిరసనలకు కేటీఆర్ పిలుపునివ్వడంతో ఉదయం నుంచే గ్రామాలు, పట్టణ కేంద్రాల్లో సీఎం రేవంత్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. నందినగర్ నివాసంతో పాటు తెలంగాణ భవన్, ఎర్రవల్లి ఫాంహౌస్ల వద్దకు పొద్దున్నుంచే కార్యకర్తలు వచ్చి చేరారు.
అయితే, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్ నందినగర్ చేరుకున్నప్పటి నుంచి విచారణ ముగిసేదాకా కేటీఆర్, హరీశ్రావు కేసీఆర్ ఇంట్లోనే ఉన్నారు. కార్యకర్తలను నందినగర్ ఇంటి దగ్గరికి రాకుండా కొద్ది దూరంలోనే పోలీసులు నిలిపేశారు. మీడియాకూ అనుమతివ్వలేదు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తెలంగాణభవన్ వద్ద ఉండిపోయారు. అక్కడే నిరసనలకు పిలుపునిచ్చారు.
సీఎం ఇంటి ముట్టడికి యత్నం..
పలువురు బీఆర్ఎస్ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలు ధరించి తెలంగాణ భవన్లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. సీఎం రేవంత్ ఇంటితో పాటు మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించగా, వారిని తెలంగాణ భవన్ వద్దే పోలీసులు అడ్డగించారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి నందినగర్వెళ్లేందుకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విచారణ ముగిసే వరకు వారిని భవన్ నుంచి పోలీసులు కదలనివ్వలేదు.
రాత్రి 7.50 గంటల సమయంలో సిట్ విచారణ పూర్తయ్యాక నేతలంతా ర్యాలీగా నందినగర్ ఇంటి వద్దకెళ్లారు. భారీగా కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. విచారణ పూర్తయ్యాక కేసీఆర్ బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు. ఉదయం 10.30కు ఎర్రవల్లి నుంచి భారీ కాన్వాయ్తో కేసీఆర్ హైదరాబాద్కు బయల్దేరారు.
ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ
సిట్ విచారణ అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీలో రెబెల్స్ సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు. పార్టీ బలంగా ఉందని, కష్టపడితే మున్సిపల్ ఎన్నికల్లో గెలవొచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయని విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతమవుతున్నదని, త్వరలోనే చాలా మంది పార్టీలో చేరుతారని వారికి చెప్పారు.
