మే 17న బీఆర్ఎస్ ఎల్పీ స‌మావేశం.. 

మే 17న బీఆర్ఎస్ ఎల్పీ స‌మావేశం.. 

హైద‌రాబాద్ : మే 17వ తేదీ (బుధవారం) తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం జరగనుంది. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం జరగనుంది. బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌, పార్లమెంటరీ పార్టీ సభ్యులు పాల్గొనే ఈ సమావేశంలో జూన్‌ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మే 13న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో 21 రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులకు మార్గనిర్దేశనం చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల నిర్వహణలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులుగా పోషించాల్సిన పాత్రపై బుధవారం జరిగే సమావేశంలో దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దశాబ్ది ఉత్సవాల నిర్వహణతో పాటు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లు హాజరకావాలని పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశించారు.