సీఎం, మంత్రులది అధికార దుర్వినియోగం : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు

సీఎం, మంత్రులది అధికార దుర్వినియోగం : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా సీఎం, మంత్రులు, కాంగ్రెస్​ఎమ్మెల్యేలు, నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల కోడ్​ ఉల్లంఘించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. నామినేషన్ల నుంచి పోలింగ్​వరకూ కాంగ్రెస్​ పార్టీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అరాచకాలకు పాల్పడిందని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

బీఆర్ఎస్​ అభ్యర్థులను బెదిరించారని, దాడులకు తెగబడి హీనమైన రాజకీయాలు చేశారని మండిపడ్డారు. చట్టాన్ని కూడా లెక్క చేయకుండా కొందరు పోలీసులు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్​ ఇలాంటి నీచ రాజకీయాలకు తెగబడటం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనన్నారు.

కాంగ్రెస్​ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు, దుష్ట పన్నాగాలు ప్రజల తీర్పును ఏమాత్రం ప్రభావితం చేయలేవని పేర్కొన్నారు. అధికార పార్టీ అకృత్యాలకు అదరకుండా, బెదరకుండా బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన కార్యకర్తలు, ఇన్​చార్జ్​లకు కృతజ్ఞతలు తెలిపారు.