
- కాంగ్రెస్ మేనిఫెస్టో చదివారు
- గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదు: కడియం శ్రీహరి
- రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికపై రూట్మ్యాప్ లేదని విమర్శ
హైదరాబాద్, వెలుగు : గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లు ఉందని, ఆమె చేత రాష్ట్ర ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్పించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గవర్నర్ ప్రసంగంలో ఆరు గ్యారంటీలకు సంబంధించిన ప్రణాళిక ప్రస్తావించలేదని, అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన ఎటువంటి రూట్ మ్యాప్ ప్రకటించలేదని అన్నారు. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. ఇప్పడు ప్రజలు సంతోషపడుతున్నట్లు, తెలంగాణ ప్రజలు ఇప్పుడే స్వేచ్ఛావాయువులు పీల్చుతున్నట్లు గవర్నర్ మాట్లాడటం సరికాదని, 2014లోనే ప్రజలు లిబరేట్ అయ్యారని పేర్కొన్నారు. పదేండ్లలో రాష్ట్రం తిరోగమన దిశలో ఉన్నట్లు గవర్నర్ మాట్లాడారని, జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకున్న సంగతి మర్చిపోయారని అన్నారు.
ఆర్బీఐ, నీతీఆయోగ్ లాంటి సంస్థలు రాష్ట్రానికి అవార్డులు ఇచ్చిన సంగతి గవర్నర్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. తలసరి ఆదాయం, పట్టణ సుందరీకరణలో టాప్లో ఉన్నామని తెలిపారు. ట్యాక్స్, రెవెన్యూ పెంపొందించుకోవడంలో తెలంగాణ ముందుందని, వీటి గురించి గవర్నర్ మాట్లాడలేదన్నారు. 24 గంటల కరెంట్ గురించి రైతులు కంప్లైంట్ చేయలేదని, కాంగ్రెస్ కావాలనే ఆరోపణలు చేస్తుందని తెలిపారు. కడియంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, అరికేపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.