దోమ తెర ధరించి సుధీర్ రెడ్డి నిరసన... ఫాగింగ్ మిషన్ తో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే

దోమ తెర ధరించి సుధీర్ రెడ్డి నిరసన... ఫాగింగ్ మిషన్ తో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే
  • అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. వాగ్వాదం
  • హైదరాబాద్​లో నోరు తెరిస్తే దోమలు నోట్లోకే పోతున్నయ్: సుధీర్​ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ సిటీలో దోమల బెడదపై బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. అసెంబ్లీకి ఫాగింగ్​ మిషన్, దోమతెరతో కుట్టిన డ్రెస్​ తీసుకుని వచ్చారు. అయితే, భద్రతా సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. ఫాగింగ్​ యంత్రాన్ని, దోమతెరను ఆయన్నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందితో సుధీర్​రెడ్డి వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ సమావేశాలు నడవనప్పుడు కూడా ఇలాంటి ఆంక్షలేంటని భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దోమ తెరతో కుట్టించిన డ్రెస్​ వేసుకుని అసెంబ్లీ మీడియా హాల్​లో మాట్లాడారు. 

హైదరాబాద్​లో నోరు తెరిస్తే దోమలు నోట్లోకి వెళ్తున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన మండిపడ్డారు. దోమల నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని, ఫాగింగ్​ చేయట్లేదని విమర్శించారు. దీంతో ప్రజలు డెంగ్యూ, మలేరియాతో ఆస్పత్రుల పాలవుతున్నారన్నారు. దోమలను నివారించలేని ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నించారు. హైదరాబాద్​ను మూడు ముక్కలు చేసి మరిన్ని సమస్యలకు కారణమయ్యారని ఆరోపించారు. 

దోమల బెడదకు భయపడి ఎవరూ హైదరాబాద్​కు రావడం లేదన్నారు. దోమల సమస్యకు పరిష్కారం చూపకుంటే హైదరాబాద్​ బ్రాండ్​ ఇమేజ్​కు మరింత నష్టం జరుగుతుందన్నారు. ప్రతి డివిజన్​కూ 10 ఫాగింగ్​ మెషీన్లు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కరోనా వచ్చినప్పుడు మాస్క్​ పెట్టుకున్నట్టే.. ఇప్పుడు దోమల సమస్యను తట్టుకోలేక దోమ తెర కుట్టించుకునే పరిస్థితి వచ్చిందని సుధీర్​రెడ్డి  ఫైర్​ అయ్యారు.