దానం నాగేందర్‌‌‌‌ను ఓడిస్తాం

దానం నాగేందర్‌‌‌‌ను ఓడిస్తాం
  •     సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్, వెలుగు : లోక్‌‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌‌‌‌ను ఓడిస్తామని సికింద్రాబాద్‌‌ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలు సవాల్ చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశాన్ని ఆదివారం తెలంగాణ భవన్‌‌లో నిర్వహించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. 

తనకు అండగా ఉండాలని, పార్టీని గెలిపించుకోవాలని పద్మారావుగౌడ్ కోరారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన దానం నాగేందర్​ను  ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్ మాట్లాడారు. దానంను తీవ్రస్థాయిలో విమర్శించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ఆయన కబ్జా పెట్టని ప్రభుత్వ స్థలం లేదని ఆరోపించారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి పైసలు తీసుకొని 20శాతం కుడా ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి డిపాజిట్ రాకుండా ఓడించాలని కేడర్ కు పిలుపునిచ్చారు. తాము పార్టీ మారడం లేదని, కావాలని తమపై కొందరు బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.