
- బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రస్తావన లేకపోవడంపై విమర్శలు
- ఎన్నికల టైమ్లో ఈ వివక్ష ఏమిటని ప్రతిపక్ష లీడర్ల అభ్యంతరం
- ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు
హైదరాబాద్, వెలుగు: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం జరగడంతో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల భద్రతను పెంచారు. ఇప్పుడు వారికి ఉన్న గన్మన్ల సంఖ్యను 2 ప్లస్2, 3 ప్లస్ 3 నుంచి 4 ప్లస్4 ప్లస్కు పెంచారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్అడిషనల్ డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఈ ఉత్తర్వుల్లో ఎక్కడా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల భద్రత పెంపుపై ఆదేశాలు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారు కూడా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రచారం చేస్తున్నారు.
అయినా సెక్యూరిటీ పెంపులో స్టేట్ఇంటెలిజెన్స్ఏడీజీ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వైపే మొగ్గు చూపి కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులను విస్మరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రమాదం పొంచి ఉంది.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు భద్రత పరమైన ఇబ్బందులేమి లేవా’ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మోస్ట్ అర్జెంట్ పేరుతో ఫ్యాక్స్
దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడితో అలర్ట్అయిన పోలీస్శాఖ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంచింది. సోమవారం వరకు ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని 4+4కు పెంచుతూ ఇంటెలిజెన్స్ ఏడీజీ సోమవారం ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులకు పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు మోస్ట్ అర్జెంట్ పేరుతో ఫ్యాక్స్ మెసేజ్ పంపించారు. దీంతో సోమవారం రాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలకు 4+4 భద్రత అమలు చేస్తున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలపై దాడులు జరగవా?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమే భద్రత పెంచడంపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు భద్రత పెంచకపోవడంపై మండిపడుతున్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని పార్టీల నేతలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్క ఘటనతో అధికార పార్టీ అభ్యర్థులకు 4+4 భద్రత ఎలా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్రావు అన్నారు. బీఆర్ఎస్ నేతలకు భద్రత పెంచారు కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎందుకు పెంచలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలకు భద్రత కల్పించి విపక్షాలపై దాడులు చేయిస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ఎంపీలు, ఎమ్మెల్యేల్లో కొందరిని బెదిరించిన ఉదంతాలున్నాయి. వారి భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలకు భద్రత పెంచాలనే డిమాండ్సర్వత్రా వినిపిస్తోంది.