ఓటు రాజకీయాలతో మైనారిటీలకు నష్టం : ఎంపీ అర్వింద్​

ఓటు రాజకీయాలతో మైనారిటీలకు నష్టం : ఎంపీ అర్వింద్​
  • బీసీల్లోని చాలా కులాలపట్ల బీఆర్​ఎస్​ చిన్నచూపు చూస్తోంది
  • బుడబుక్కల కులానికి ఎంపీ అర్వింద్​ క్షమాపణ

నిజామాబాద్​, వెలుగు: బీఆర్ఎస్​ పార్టీ మైనారిటీ ఓట్ల కోసం చేస్తున్న పాలిటిక్స్​ ఆ వర్గాన్ని తీవ్రంగా నష్టపరుస్తుందని ఎంపీ అర్వింద్​ అన్నారు. ఎంఐఎంతో ఆ పార్టీ దోస్తానా  మరింత చేటు చేస్తుందన్నారు. మంగళవారం ఆయన నగరంలోని ఉర్దూ మీడియా కోసం ప్రత్యేకంగా మీటింగ్​ ఏర్పాటు చేసి మాట్లాడారు. 

ఇటీవల ఆయన మంత్రి కేటీఆర్​ను ఉద్దేశించి 'బుడబుక్కల' అనే పేరును సంబోధిస్తూ విమర్శించారు. బుడబుక్కల అనేది కులం పేరని తనకు నిజంగా తెలియదని తన మాటలతో ఆ సామాజిక వర్గానికి చెందిన కులస్థులు బాధపడి ఉంటే అందుకు క్షమాపణ చెబుతున్నానని స్పష్టతనిచ్చారు. బుడబుక్కల, తోలుబొమ్మల తదితర కులాల వాళ్లు తమ సమస్యలు చెప్పుకోవడానికి తన వద్దకు వచ్చారని అన్నారు. ఆయా కులాల కుల ధ్రువీకరణ పత్రాలు ఆలస్యంగా వస్తున్నాయని  బీఆర్​ఎస్​ ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు వివరించారు. సంచార జాతులకు చెందిన బీసీ కులస్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, అన్ని సంక్షేమ పథకాలు వారికి అమలు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. 

ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ భారతీయులన్నారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న ఆవాస్​​ యోజనతో బీజేపీయేతర గవర్నమెంటు ఉన్న రాష్ట్రాలు లాభపడ్డాయని లబ్ధిదారులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం నేరుగా అందుతుందన్నారు. ఇండ్లను మహిళల పేరున రిజిస్ట్రర్​ చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్​ డబుల్​రూమ్​ ఇండ్లు ఇవ్వక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.  

ఆయుష్మాన్​ భారత్​ కింద రూ.5 లక్షల సహాయం పొందే వీలుందన్నారు. ముద్రలోన్​తో ముస్లిం మైనారిటీలకు మేలు కలిగిందన్నారు. యూపీలో మైనారిటీ ఓట్ల శాతం ఎక్కువ ఉన్న నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థులు గెలిచారన్నారు. యూసీసీని సరిగా అర్థం చేసుకోక వ్యతిరేకత పెంచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో  దళితబంధుకు రూ.10 లక్షలు, మైనారిటీ బంధుకు రూ.లక్ష ఏమిటన్నారు. స్టేట్​లో ఈ రెండు సామాజికవర్గాల జనాభా దాదాపు సమానంగా ఉండగా రాజకీయాలు చేస్తున్నారన్నారు.  

సీఎం కేసీఆర్​ తిరస్కరిస్తున్న కేంద్ర సర్కారు పథకాలు స్టేట్​లో అమలుకావాలంటే  మైనారిటీలతో సహా అన్ని వర్గాల వారు బీజేపీ వైపు రావాలన్నారు. బీజేపీ వద్దనుకునే మైనారిటీలు నోటాకు ఓటు వేయాలన్నారు. బీఆర్​ఎస్​కు వేసి భవిష్యత్తు పాడు చేసుకోవద్దన్నారు. కాంగ్రెస్​ అసలు పోటీలో లేదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వాలక్షీనర్సయ్య, ధన్​పాల్​సూర్యనారాయణ గుప్తా, స్రవంతిరెడ్డి తదితరులు ఉన్నారు.