- సభ్యత్వ నమోదుపై ప్రధాన కార్యదర్శులతో శిక్షణ
- జిల్లాల వారీగా ఇన్ చార్జుల నియామకం
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును డిజిటల్ పద్ధతిలోనే చేపట్టాల్సిందిగా నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా కేంద్రం ‘సర్’ను ఆన్లైన్లో చేపడుతున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదును కూడా డిజిటల్లోనే చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 35,655 పోలింగ్ బూత్లలో బూత్కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మందికి శిక్షణ తరగతులు నిర్వహించాలని, డిజిటల్ మెంబర్ షిఫ్కు సంబంధించి శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు. మంగళవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఇందులో సభ్యత్వ నమోదు ప్రక్రియపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ప్రతి నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ సమన్వయకర్తను నియమించాలన్నారు. ప్రతి మండలానికి, మున్సిపాలిటీల వారీగా సభ్యత్వ సమన్వయ కమిటీలనూ నియమించాలని సూచించారు. శిక్షణా శిబిరాలను పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో జరగాలన్నారు. సభ్యత్వ నమోదుకు జిల్లాల వారీగా ఇన్చార్జులను నియమించారు.
