
ముంబై: బెంచ్మార్క్ ఇండెక్స్లు బుధవారం సెషన్లో ఓపెనింగ్ లాభాలను కోల్పోయి ఫ్లాట్గా ముగిశాయి. ఆర్బీఐ ఎంపీసీ పాలసీ వివరాలు వెలువడే ముందు (గురువారం) ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపారు. నిఫ్టీ కేవలం ఒక్క పాయింట్ లాభపడి 21,931 దగ్గర సెటిలయ్యింది. ఇంట్రాడేలో 22,053 వరకు ఈ ఇండెక్స్ పెరిగింది. సెన్సెక్స్ 34 పాయింట్ల (0.05 శాతం) నష్టంతో 72,152 దగ్గర ముగిసింది.
ప్రాఫిట్ బుకింగ్ వలన టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. కొన్ని బ్యాంకింగ్, ఫార్మా షేర్లు కూడా పడ్డాయి. గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్గా ఉన్నా ఆర్బీఐ పాలసీ వెలువడే ముందు మార్కెట్ రేంజ్బౌండ్లో కదిలిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. వడ్డీ రేట్ల తగ్గింపు, లిక్విడిటీ పెంచడంపై ఆర్బీఐ ఏమైనా సంకేతాలు ఇస్తుందా? అని మార్కెట్ చూస్తోందన్నారు.
సెన్సెక్స్లో ఎస్బీఐ షేర్లు 4 శాతం వరకు పెరిగాయి. సీఏపీఎస్ సబ్సిడరీని రూ.708.07 కోట్లకు కొనుగోలు చేశామని బ్యాంక్ ప్రకటించడంతో షేర్లు దూసుకుపోయాయి. రిజల్ట్స్ మెప్పించడంతో నెస్లే షేర్లు రెండు శాతం పెరిగాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు కూడా లాభాల్లో క్లోజయ్యాయి.