
- గత 18 ఏండ్లలో రెండోసారి మాత్రమే
- క్యూ4లో రూ.280 కోట్ల ప్రాఫిట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ వరుసగా రెండో క్వార్టర్లోనూ నికర లాభాన్ని సాధించింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన నాలుగో క్వార్టర్లో రూ.280 కోట్ల ప్రాఫిట్ సాధించామని కంపెనీ మంగళవారం ప్రకటించింది. గత ఏడాది మార్చి క్వార్టర్లో బీఎస్ఎన్ఎల్కు రూ.849 కోట్ల లాస్ వచ్చింది. "18 ఏళ్ల తర్వాత మొదటిసారి, వరుసగా రెండు క్వార్టర్లలో నెట్ ప్రాఫిట్ సాధించాం. ఇది కేవలం ఆపరేటింగ్ ప్రాఫిట్ కాదు, పాజిటివ్ మార్జిన్ కూడా కాదు, నెట్ ప్రాఫిట్. 2007 తర్వాత ఇలా జరగడం రెండోసారి" అని కేంద్ర టెలికాం మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.
కిందటేడాది డిసెంబర్తో ముగిసిన క్వార్టర్ (క్యూ3) లో బీఎస్ఎన్ఎల్ రూ.262 కోట్ల నికర లాభాన్ని సాధించింది. వరుసగా రెండు క్వార్టర్లలో లాభాలు రావడంతో 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ నష్టం రూ.2,247 కోట్లకు తగ్గింది. కంపెనీకి 2023–24 లో రూ.5,370 కోట్ల నష్టం వచ్చింది. "ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, ప్రభుత్వ సపోర్ట్, రెవెన్యూ, లాభం మీద ఫోకస్ వల్ల ఇది సాధ్యమైంది. బీఎస్ఎన్ఎల్ను కేవలం బతికించడం కాదు, రూపురేఖలు మార్చాలని చూస్తున్నాం" అని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ. రాబర్ట్ జె. రవి చెప్పారు.
ఖర్చులు తగ్గించుకుంటామని, 4జీ/5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తెస్తామని, ప్రతి ఇండియన్కు తక్కువ ధరల్లో హై-క్వాలిటీ కనెక్టివిటీ సర్వీస్లను అందిస్తామని పేర్కొన్నారు. "మా గోల్ కేవలం ప్రాఫిట్స్ సంపాదించడం మాత్రమే కాదు. అదిరిపోయే సర్వీసులను అందివ్వడం. అందరికీ చేరువవ్వడం" అని రవి వివరించారు. 2024-–-25 లో బీఎస్ఎన్ఎల్ ఆపరేటింగ్ రెవెన్యూ ఏడాది లెక్కన 7.8 శాతం పెరిగి రూ.19,330 కోట్ల నుంచి రూ.20,841 కోట్లకు చేరింది.