- ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే..
- నేను రెచ్చగొట్టలే: డానిశ్ అలీ
న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చెబుతున్నవన్నీ కట్టుకథలని బీఎస్పీ ఎంపీ డానిశ్ అలీ మండిపడ్డారు. ‘‘లోక్ సభలో నా సీటుకు, రమేశ్ బిధూరీ సీటుకు మధ్య చాలా దూరం ఉంటుంది. అలాంటప్పుడు నేను మైక్ లేకుండా మాట్లాడితే ఆయనకు ఎలా వినిపిస్తుంది. నిశికాంత్ దూబే చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి, అదే నిజమని నమ్మించేలా చేయడం బీజేపీ లీడర్లకు అలవాటే” అని విమర్శించారు.
‘‘నేను రమేశ్ను రెచ్చగొట్టానని, ప్రధానిని తిట్టానని నిశికాంత్ దూబే ఓ కట్టుకథ చెబుతున్నారు. ఇప్పటికే లోక్ సభలో మాటలతో నాపై దాడి చేశారు. మళ్లీ ఇప్పుడు సభ బయట కూడా చేస్తున్నారు. దేశ ప్రధానిపై అలాంటి వ్యాఖ్యలు చేసే స్థాయికి నేను ఇంకా దిగజారలేదు. నాది అలాంటి క్యారెక్టర్ కాదు” అని డానిశ్ అలీ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ నిరాధార ఆరోపణలపై విచారణ జరిపించాలని స్పీకర్ను కోరారు.