ఇవాళ గన్ పార్క్ దగ్గర బీఎస్పీ సత్యాగ్రహ దీక్ష

ఇవాళ గన్ పార్క్ దగ్గర  బీఎస్పీ సత్యాగ్రహ దీక్ష

గ్రూప్ 2వాయిదా వేయాలి
 

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ -2 ఎగ్జామ్ ను వాయిదా వేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం గన్ పార్క్ వద్ద శాంతి యుత సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వందమంది గ్రూప్ 2 అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కలిశారు. ఎగ్జామ్ వాయిదా వేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వినతిపత్రం అందజేశారు. గురుకుల టీచర్, పాలిటెక్నిక్‌ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల పరీక్షలు పూర్తయిన తర్వాతే గ్రూప్‌- 2 నిర్వహించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ‘‘ఈ నెలలో ఐబీపీఎస్, ఆర్ఆర్ బీ తదితర పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారు. రాష్ట్రంలో వరుసగా పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు రావడంతో.. దేనికి ప్రిపేర్ కావాలో అర్థంకాక గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అందుకే టీఎస్ పీఎస్సీని ముట్టడించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణం” అని మండిపడ్డారు. గతంలో టీఎస్ పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 సహా కొన్ని పరీక్షల పేపర్లు లీక్ కావడంతోనే ఈ దుస్థితి నెలకొందని అన్నారు.