
దేవరకొండ, వెలుగు: ప్రగతిభవన్లో పాగా వేయడమే బహుజనుల లక్ష్యం కావాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్అన్నారు. ఆదివారం రాత్రి నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర హై స్కూల్ ఆవరణలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్శ్రీ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధన సదస్సులో ఆయన మాట్లాడారు. దేవరకొండ ప్రాంత ప్రజలు ఉపాధి లేక హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లి రోజుకు రెండు నుంచి మూడు వందల కూలి సంపాదిస్తుంటే.. సీఎం కేసీఆర్ నెలకు రూ 4.25 లక్షల జీతం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నక్కలగండి, పుట్టంగండి, గొట్టిముక్కల ప్రాజెక్టులతో నిర్వాసితులైన గిరిజనులు వారి భూముల్లోనే కూలీలుగా మారడం బాధాకరమన్నారు. గిరిజన స్టూడెంట్లు చదివే యూనివర్సిటీల్లో 3 వేల లెక్చరర్ పోస్టులు ఉండగా వీటిలో 1800 ఖాళీగా ఉన్నాయన్నారు. ఇలాగైతే తమ బిడ్డలకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం విద్యను ప్రైవేట్పరం చేస్తోందన్నారు. విద్యను ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచనతోనే రాష్ట్రంలో విజ్ఞాన్, అనురాగ్, మల్లారెడ్డి యూనివర్సిటీలు వచ్చాయని ఆరోపించారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే దేవరకొండను సేవాలాల్జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు వెంకటేశ్చౌహాన్, మాలావత్పూర్ణ, జానపద గాయకుడు సుక్క రాంనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.