ఉద్యోగాలపై ఏఐ దెబ్బ.. 55 వేల మందిని తొలగించనున్న బీటీ గ్రూప్‌‌

ఉద్యోగాలపై ఏఐ దెబ్బ.. 55 వేల మందిని తొలగించనున్న బీటీ గ్రూప్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: బ్రిటన్‌‌లోని అతిపెద్ద బ్రాడ్ బ్యాండ్ సంస్థ బీటీ గ్రూప్ తన ఉద్యోగుల సంఖ్యను 55 వేల మేర తగ్గించాలని చూస్తోంది. కంపెనీ వీరి స్థానంలో ఏఐ టెక్నాలజీలను వినియోగించటం ద్వారా ఖర్చుల భారాన్ని తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉంది.  2030 నాటికి దశల వారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ చర్యల ద్వారా  రూ.30వేల కోట్ల వరకు ఖర్చులను తగ్గించుకుంటామని కంపెనీ సీఈవో అలైసన్ కిర్క్బి వెల్లడించారు. మారుతున్న ఏఐ యుగంలో తక్కువ మంది ఉద్యోగులతో సమర్థవంతంగా సేవలను కొనసాగించటానికి వీలుపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఏఐతో రానున్న దశాబ్దంలో వ్యాపారంలో భారీగా మార్పులు రానున్నాయని అన్నారు.   ఇదే క్రమంలో కంపెనీ తన ఓపెన్ రీచ్ బ్రాడ్ బ్యాండ్ నెట్‌‌వర్క్‌‌  విభాగాన్ని టెలికాం వ్యాపారం నుంచి విడదీయాలని చూస్తోంది.   అలైసన్ సీఈఓ అయ్యాక ఇటలీ, ఐరిష్‌లోని కంపెనీ వ్యాపారాలను విక్రయించారు.