
యు ట్యూబ్ లో ఫేమస్ అవడానికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చెందూరుకు చెందిన రామిరెడ్డి అనే బీటెక్ విద్యార్ధి యుట్యూబ్ లో వీడియోల కోసం రైలు పట్టాలపై ద్విచక్ర వాహనాలు, బాణాసంచా, బొమ్మలు పెట్టి, వాటిని తొక్కిన రైలు వీడియోలను అప్ లోడ్ చేస్తుండేవాడు. ఈ అలవాటు కాస్త హద్దు మీరి ఓ గ్యాస్ సిలిండర్ ను కూడా రైలు పట్టాలపై పెట్టి, దానిపై రైలు వెళితే ఎలా ఉంటుందోనని వీడియో తీశాడు. అయితే అదృష్ట వశాత్తూ ఆ ఘటనలో ఏ ప్రమాదం జరగలేదు. ఈ వీడియోలను ట్విట్టర్ ద్వారా చూసిన హైదరాబాద్ కు చెందిన నరసింహ అనే వ్యక్తి రామిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు రామిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు..అతని పై 147/153 సెక్షన్స్ నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.