న్యూఢిల్లీ: ఫారిన్ టూర్ ప్యాకేజీలకు వసూలు చేసే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ (టీసీఎస్)ను తగ్గించింది. ఈమేరకు ఈ ట్యాక్స్ ను 2 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో విదేశీ టూర్ల ప్యాకేజీ రూ.10 లక్షల వరకు ఉంటే 5 శాతం టీసీఎస్, అంతకు మించి ఉంటే 20 శాతం కేంద్రం వసూలు చేసేది. ప్రస్తుత తగ్గింపుతో ప్రయాణికులు, టూర్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న అధిక ముందస్తు పన్ను భారం తొలగిపోనున్నది.
టీసీఎస్ తగ్గింపుతో లక్షలాది మంది ఇండియన్లకు విదేశీ ప్రయాణం మరింత సులభం కానుంది. అలాగే, విద్య, వైద్య చెల్లింపుల కోసం లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద టీసీఎస్ రేట్లను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది. దీంతో విదేశాల్లో భారతీయ వినియోగదారులు ఫ్రెండ్లీ ట్యాక్స్ ట్రీట్మెంట్ వైపు మళ్లిస్తోంది.
ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు..
పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ను కనెక్ట్ చేస్తూ ‘ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్’ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, ఆరు ఈశాన్య రాష్ట్రాలతో బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి కోసం కూడా ఓ పథకాన్ని ప్రారంభించాలని నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదించారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, మిజోరాం, త్రిపుర ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సర్క్యూట్ల అభివృద్ధి కోసం కొత్త పథకాన్ని రూపొందిస్తామని చెప్పారు.
ఈ పథకం దేవాలయాలు, మఠాల సంరక్షణ, తీర్థయాత్ర వివరణ కేంద్రాలు, యాత్రికుల సౌకర్యాలను కవర్ చేస్తుందని చెప్పారు. అలాగే, బీహర్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లను కలుపుకొని తూర్పు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ‘పూర్వోదయ’కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 4 వేల ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు.
