ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దేశం కలల కన్న ప్రాజెక్ట్ ఇది అని ఈ సందర్భంగా బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. జాతీయ ప్రాముఖ్యత, ప్రజా ప్రయోజనాల కోసమే బుల్లెట్ ట్రైన్ అని తెలిపింది. ముంబైలోని విక్రోలి ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం, ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ ప్రారంభించిన భూసేకరణకు వ్యతిరేకంగా గోద్రెజ్ అండ్ బోయ్స్ దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. ఈ ప్రాజెక్టులు జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని, ప్రజా సంక్షేమం కోసమేనని కోర్టు పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకమైనదని, ప్రైవేట్ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. దీంతో బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయ్యింది. దీంతో రైల్వే శాఖ త్వరలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
ముంబై-అహ్మదాబాద్ మధ్య మొత్తం 508.17 కి.మీ రైలు మార్గంలో దాదాపు21 కి.మీ భూగర్భంలో ఉండేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. కాగా గతేడాది అక్టోబర్లో కంపెనీకి రూ.264 కోట్ల పరిహారం చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం, కోర్టుకు తెలిపింది. తమకు పరిహారం చెల్లించాలని మహారాష్ట్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 15న జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ గోద్రెజ్ అండ్ బోయ్స్ పిటిషన్ దాఖలు చేసింది.