నిజామాబాద్ లో ఏటీఎం దొంగల అరెస్టు

నిజామాబాద్ లో ఏటీఎం దొంగల అరెస్టు

నిజామాబాద్, వెలుగు: తాళం వేసిన ఇండ్లలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లొచ్చిన కుటుంబ ముఠాయే ఏటీఎంల్లో నగదు దోపిడీకి యత్నించిందని ఇన్​చార్జి పోలీస్​ కమిషనర్​ జయరాం తెలిపారు. బడా భీంగల్, అంక్సాపూర్​లో ఏటీఎంలు వీరే ధ్వంసం చేశారని ఆయన తెలిపారు. నలుగురు నిందితులను గురువారం మీడియా ఎదుట ప్రవేశపెట్టి  వివరాలు వెల్లడించారు. జక్రాన్​పల్లికి చెందిన అల్లెపు స్వామి అతడి తమ్ముడు అల్లెపు దేవేందర్, బామ్మర్ది నవీన్​నిజామాబాద్, నిర్మల్​జిల్లాల్లో 19 దొంగతనాలు చేసి జైలు వెళ్లొచ్చారు.

దొంగతనం చేసిన బంగారాన్ని దేవేందర్ ​తన భార్య శైలజ ద్వారా విక్రయించేవాడు. సులువుగా డబ్బు సంపాదించడానికి ఈ నలుగురు ఏటీఎం చోరీలను ఎంచుకున్నారు. ఈ నెల 9న అర్ధరాత్రి భీంగల్​లోని బడాభీంగల్​కాలనీలో ఏటీఎంను లూటీ చేయడానికి ప్రయత్నించారు. గడ్డపారలతో కొట్టినా మానీ బాక్స్​ఓపెన్​కాకపోవడంతో వెళ్లిపోయారు.

10వ తేదీ తెల్లవారుజామున వేల్పూర్​ మండలంలోని అంక్సాపూర్​లోని యూనియన్​ బ్యాంక్ ఏటీఎం పగులగొట్టడానికి విఫలయత్నం చేశారు. గంటపాటు ప్రయత్నించినా తెరుచుకోకపోవడంతో గడ్డపారల చప్పుడుకు ప్రజలు వస్తారని భయపడి అప్పటికే తెచ్చిపెట్టిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్​లో ఏకంగా ఏటీఎం తరలించడానికి పూనుకున్నారు. ప్రజలు కేకలు వేయడంతో పారిపోయారు. టెక్నికల్​ఆధారాలతో నలుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేశామన్నారు. 

ALSO READ: అర్థరైటిస్ పై అవగాహన కల్పించాలి : శ్రీనివాస్ గౌడ్

పోచంపాడ్ ​ఏటీఎం దోపిడీలో అరెస్టు 


మెండోరా మండలంలో గత నెల 27న జరిగిన ఏటీఎం దోపిడీ కేసును ఛేదించామని ఇన్​ఛార్జి కమిషనర్ జయరామ్​తెలిపారు. హరియాణాకు చెందిన ఆరుగురు ఇందులో భాగస్వామ్యులయ్యారన్నారు. జునైల్​అనే నిందితుడిని అరెస్ట్​చేశామని, అయిదుగురు పరారీలో ఉన్నారన్నారు. ఈ ఘటనలో రూ.12.46 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లారన్నారు.