అర్ధరాత్రి దొంగల బీభత్సం : కారుతో SIపైకి దూసుకొచ్చారు

అర్ధరాత్రి దొంగల బీభత్సం : కారుతో SIపైకి దూసుకొచ్చారు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  అర్ధరాత్రి ఓ నగల దుకాణం వద్ద కారులో మకాం వేసిన దొంగలు..  అడ్డుకోబోయిన ఎస్సైని కారుతో ఢీ కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఎస్సై త్రుటిలో తప్పించుకోవడంతో పరారయ్యారు. దుండిగల్ ఎస్సై శేఖర్​రెడ్డి పేట్​బషీరాబాద్ పరిధిలో తన టీంతో కలిసి సోమవారం తెల్లవారు జామున 2.10 గంటలకు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. ఇదే టైంలో దూలపల్లిలోని గణేష్​నగల దుకాణం వద్ద కారులో కొంత మంది అనుమానస్పదంగా కూర్చుని ఉండటాన్ని డ్రైవర్ బ్రహ్మం గుర్తించి కారు ఆపాడు. పోలీసుల కారు ఆగడం గమనించిన దొంగలు తమ మారుతి సుజుకీ కారు (10ఈజీ 7029)ను స్టార్ట్ చేసి, అందులో పారిపోయేందుకు ప్రయత్నించారు.

దొంగల కారు కదలడంతో అప్రమత్తమైన ఎస్సై శేఖర్ రెడ్డి వెంటనే కారు దిగి పరుగెత్తుకొచ్చి ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ దొంగలు వేగంగా అతడిపైకి దూసుకొచ్చి ఢీకొట్టే ప్రయత్నం చేశారు. ఎస్సై త్రుటిలో తప్పించుకుని పక్కకు జరిగాడు. పారిపోయిన దొంగలను తర్వాత పోలీసులు ఛేజ్ చేశారు. పోలీసులు వెంట పడటంతో దొంగలు దూలపల్లి ఫారెస్ట్​ మెయిన్ రోడ్డు వద్ద అదుపు తప్పి చెట్టుకు ఢీ కొట్టారు. కారును వదిలి అడవిలోకి పారిపోయారు. దొంగలు కారుకు తాళం చెవికి బదులు కత్తెర వాడటంతో దాన్ని దొంగిలించారని భావిస్తున్నారు. కారులో కట్టర్, రాడ్, రాళ్లు ఉన్నాయి. అల్వాల్​లో ఉదయం 2 ఏటీఎంల దొంగతనానికి విఫలయత్నం చేసి రాత్రి పూట దూలపల్లిలో బంగారు దుకాణంలో దొంగతనానికి వీరు వచ్చి ఉంటారని భావిస్తున్నారు.