సికింద్రాబాద్, వెలుగు: రైళ్లల్లో వెళ్లాలనుకునే వారు టికెట్ల కోసం ఇక నుంచి క్యూలైన్లలో నిలబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు.స్టేషన్లోని జనరల్ బుకింగ్కౌంటర్లలో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నిమిషాల్లో ట్రైన్ టికెట్ కొనుగోలు చేయొచ్చు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న దక్షిణ మధ్య రైల్వే.. జనరల్ బుకింగ్ కౌంటర్లలో కొత్తగా నగదు రహిత లావాదేవీలను తీసుకొచ్చింది. క్యూఆర్ కోడ్తో టికెట్లు కొనుగోలు చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా టికెట్ కొనడానికి ప్యాసింజర్లు సరిపడే చిల్లరను తీసుకువెళ్లే అవసరం ఉండదు. తొలిదశలో సికింద్రాబాద్ డివిజన్కు చెందిన 14 స్టేషన్లలోని 31 కౌంటర్లలో ఈ సదుపాయాన్ని ప్రవేశ పెట్టారు.
క్యూఆర్ కోడ్ అమలయ్యే స్టేషన్లు
తొలి దశలో భాగంగా 14 ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో క్యూఆర్ కోడ్ అమలు చేస్తున్నారు. అందులో సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట , బేగంపేట, వరంగల్ , మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ స్టేషన్లు ఉన్నాయి. డిస్ ప్లే బోర్డులో బయలుదేరే స్టేషన్, చేరుకొనే స్టేషన్ , ప్రయాణపు తరగతి వివరాలు, పెద్దలు, పిల్లల సంఖ్య తెలిపే వివరాలతో పాటు చార్జీలు తెలియజేస్తారు. ప్రయాణికులు చెల్లించవలసిన చార్జీకి సంబందించిన క్యూ ఆర్ కోడ్ కూడా డిస్ ప్లే బోర్డులో కనిపిస్తుంది. రైలు వినియోగదారులందరూ సాధారణ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ కోరారు. ఈ విధానం పారదర్శకతకు, కచ్చితత్త్వానికి మైలు రాయిగా నిలుస్తోందని, నగదు చెల్లింపుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.
