హ్యాంగ్జౌ: ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగిన మెన్స్ డబుల్స్ గ్రూప్–బి మూడో మ్యాచ్లో సాత్విక్–చిరాగ్ 17–21, 21–18, 21–15తో రెండోసీడ్ ఆరోన్ చియా–సో వూయ్ యిక్ (మలేసియా)పై గెలిచి తొలిసారి సెమీస్లోకి ప్రవేశించింది. దాంతో ఇండియా తరఫున మెన్స్ డబుల్స్లో ఈ ఘనత సాధించిన తొలి జంటగా రికార్డులకెక్కింది.
ఇక గంటా 10 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో సాత్విక్–చిరాగ్ తొలి గేమ్ను చేజార్చుకున్నారు. స్కోరు10–10 తర్వాత క్రమంగా వెనకబడ్డారు. కానీ తర్వాతి రెండు గేమ్ల్లో ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించారు. మలేసియా జోడీ కూడా దీటుగా పోరాడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. ఓ దశలో చియా–యిక్ 15–13తో ఆధిక్యంలో నిలిచారు. కానీ పట్టు వదలకుండా పోరాడిన సాత్విక్ బలమైన స్మాష్లతో వరుసగా పాయింట్లు రాబట్టాడు. ఫలితంగా స్కోరును సమం చేసే చాన్స్ ఇవ్వకుండా గేమ్ను సొంతం చేసుకున్నారు. డిసైడర్లో 9–9 స్కోరు వరకు గేమ్ హోరాహోరీగా సాగింది. ఆ తర్వాత మలేసియా జంట ర్యాలీస్లో ఎర్రర్స్ చేసింది. ఒకటి, రెండు పాయింట్లతో ముందుకెళ్లిన ఇండియన్ ద్వయం ఈజీగా గేమ్ను, మ్యాచ్ను కైవసం చేసుకుంది. శనివారం జరిగే సెమీస్లో ఇండియా షట్లర్లు చైనాకు చెందిన లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ ద్వయంతో పోటీ పడనున్నారు.
