- ఈజీఎంను నిర్వహించిన కొంత మంది ఇన్వెస్టర్లు
- కంపెనీని నడిపే సత్తా ఆయనకు లేదని, మేనేజ్మెంట్లో అవకతవకలు జరిగాయని వెల్లడి
- ఈజీఎం చెల్లదన్న రవీంద్రన్, ఆయన ఫ్యామిలీ
న్యూఢిల్లీ: బైజూస్ ఫౌండర్, సీఈఓ బైజూ రవీంద్రన్, ఆయన ఫ్యామిలీని కంపెనీ నుంచి తొలగించేందుకు కొంతమంది ఇన్వెస్టర్లు శుక్రవారం ఎక్స్ట్రార్డినరీ జనరల్ మీటింగ్ (ఈజీఎం) ను నిర్వహించారు. ఈ ఈజీఎంలో పాల్గొన్న ఇన్వెస్టర్ల దగ్గర 32 శాతం వాటా ఉండగా, రవీంద్రన్, ఆయన ఫ్యామిలీ దగ్గర 26.3 శాతం వాటా ఉంది. ఉదయం 9.30 కి మొదలవ్వాల్సిన కంపెనీ ఈజీఎం కొన్ని కారణాల రీత్యా గంట ఆలస్యంగా స్టార్ట్ అయ్యింది. ఉద్యోగులతో కలిపి సుమారు 200 మంది ఉద్యోగులు ఈజీఎంలో వర్చువల్గా పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. చివరికి వీరిలో 40 మంది పాల్గొన్నారు.
బైజూ రవీంద్రన్, ఆయన ఫ్యామిలీ పాల్గొనలేదు. రవీంద్రన్కు సమర్థత లేదని, మేనేజ్మెంట్లో అవకతవకలు జరిగాయని ఈ ఇన్వెస్టర్లు ఆరోపిస్తున్నారు. ఆయన్ని కంపెనీ నుంచి తొలగించాలనే ఉద్దేశంతోనే శుక్రవారం ఈజీఎం నిర్వహించారు. కాగా, శుక్రవారం జరిగిన మీటింగ్ నిర్ణయాలు మార్చి 13 తర్వాతగాని అమల్లోకి రావు. కొంత మంది ఇన్వెస్టర్లకు వ్యతిరేకంగా రవీంద్రన్ వేసిన పిటిషన్పై వచ్చే నెల 13 న కర్నాటక హైకోర్టులో హియరింగ్ ఉంది. మరోవైపు ఈజీఎం జరిగే ముందు రోజు నలుగురు ఇన్వెస్టర్లు కంపెనీ మేనేజ్మెంట్పై ఎన్సీఎల్టీలో మిస్మేనేజ్మెంట్ సూట్ను ఫైల్ చేశారు. కంపెనీని నడపడానికి రవీంద్రన్కు అర్హత లేదని డిక్లేర్ చేయాలని ఇందులో కోరారు. కొత్త బోర్డును నియమించాలని, తాజాగా ముగించిన రైట్స్ ఇష్యూ చెల్లదని ప్రకటించాలని పేర్కొన్నారు. అలానే అకౌంట్లపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలన్నారు.
ఈజీఎం టార్గెట్..
థింక్ అండ్ లెర్న్ (బైజూస్) బోర్డును రద్దు చేయాలని ఈజీఎం నిర్ణయించుకుంది. సీఈఓ రవీంద్రన్, కో–ఫౌండర్ దివ్య గోకుల్నాథ్, అతని బ్రదర్ రిజూ రవీంద్రన్ను కంపెనీ నుంచి తొలగించాలని చూస్తోంది. అసోసియేషన్ అండ్ షేర్హోల్డర్ అగ్రిమెంట్ ఆర్టికల్స్కు ఈజీఎం విరుద్ధమని, చెల్లదని బైజూ రవీంద్రన్ షేర్హోల్డర్లకు ఈ వారం రెండోసారి లెటర్స్ రాశారు. కర్నాటక హైకోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని రవీంద్రన్ భావిస్తున్నారు. కాగా, షేర్హోల్డర్స్ అగ్రిమెంట్ ప్రకారం, ఈజీఎంలో కోరమ్ (మెంబర్స్తో కూడిన గ్రూప్) ఏర్పాటు కావాలంటే కనీసం ఒక ఫౌండర్ అయినా పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. షెడ్యూల్ టైమ్లోని అరగంటలోపు కోరమ్ ఏర్పడకపోతే ఈజీఎం మొదలవ్వ కూడదని చెప్పారు. ప్రొసస్ (కంపెనీలో 9.10 శాతం వాటా), పీక్ ఎక్స్వీ పార్టనర్స్ (గతంలో సెకోవియా క్యాపిటల్) (7 శాతం), జనరల్ అట్లాంటిక్ (6 శాతం), సోఫినా (5.70 శాతం), ది చాన్ జుకర్బర్గ్ ఇనీషియేటివ్ (2.40 శాతం), ఓవెల్ వెంచర్స్ (1.30 శాతం), శాండ్ క్యాపిటల్ ఈజీఎంలో పాల్గొన్నాయి.