
కారు కొనుక్కోవాలి అనేది ప్రతి సగటు మధ్యతరగతి భారతీయ కుటుంబానికి ఉండే కల. ఎక్కువగా రవాణాకు టూవీలర్లు వాడే ప్రజలు తమ కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఒక కారు ఉంటే బాగుంటుందని భావిస్తుంటారు. కానీ కారు రేటులో దాదాపు సగం వరకు పన్నులు చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని గమనిస్తే ఆ నిర్ణయాన్ని సగం మందైనా విరమించుకోక మానరు.
అరవింద్ సి థామస్ అనే ఒక చార్టడ్ అకౌటెంట్ కారు కొనుగోలు చేస్తే దానిపై ఎన్ని పన్నులు ఉంటాయో చేసిన ఒక పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కొత్తగా కొనాలనుకుంటే దానిపై చెల్లించే పన్నులు ఎంత భారీగా ఉన్నాయో తన లింక్డిన్ పోస్టులో వెల్లడించాడు. కారు బిల్లులో దాదాపు 46 శాతం వరకు పన్ను రూపంలో కట్టాల్సి రావటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వాస్తవానికి కారు ధర రూ.12లక్షల 91 వేలుగా ఉంది. దానిపై కంపెనీ అందించిన డిస్కౌంట్ తర్వాత చెల్లించాల్సిన వాస్తవ ధర రూ.12 లక్షల 80 వేలకు చేరుకుంది. ఈ మెుత్తంపై జీఎస్టీ 28 శాతం అంటే రూ.3లక్షల 58వేలు, కంపెన్సేషన్ సెజ్ 17 శాతం అంటే రూ.2లక్షల 17వేలు.. చివరిగా టీసీఎస్ 1శాతం అంటే రూ.18వేల 573 అంటే మెుత్తంగా పన్నుల రూపంలోనే అసలు కారు ధరకు అదనంగా రూ.6 లక్షలు చెల్లించాల్సి వస్తోందని సీఏ వెల్లడించారు. అయితే ఇందులో రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ఇతర ఖర్చులు కలపలేదు. వీటిని కూడా కలిపితే కారు ధర కంటే దానిపై చెల్లిస్తున్న సొమ్మే చాలా అవుతోందని తెలుస్తోంది. పన్నులు అంత దారుణంగా ఉంటే సగటు మధ్యతరగతి ప్రజలు కారు కొనుక్కోవటం అనేది కలగానే మిగిలిపోతుందని ఆయన అన్నారు.
పన్నులు అధికంగా ఉండటంతో వాహనాన్ని అప్ గ్రేడ్ చేసుకోవాలనుకునేవారికి అది ఒక అవసరం కంటే కూడా లగ్జరీ అనే ఫీలింగ్ కలుగుతోందని సీఏ చెప్పారు. చాపకింద నీరులా ఇంత భారీ పన్నులు మధ్యతరగతి కుటుంబాలపై భారంగా మారుతున్న వేళ దీనిపై ఒక్కరు కూడా నోరు విప్పక పోవటం ఆశ్చర్యంగా ఉందని పేర్కొ్న్నారు. ఇది మధ్యతరగతి ఆదాయాలకు వారి కొనుగోలు శక్తికి మధ్య పెరిగిన అంతరాన్ని కూడా సూచిస్తోంది.