మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు కేబినెట్ ఆమోదం

మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు కేబినెట్ ఆమోదం
  • కొత్తపేట కూరగాయల మార్కెట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ గా ఆధునీకరణ
     

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్ దవాఖానను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పు చేస్తూ దాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానగా అధునీకరించాలని, దానికి తోడుగా మరో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని, మొత్తం 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం పలికింది. 
కొత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు చెస్ట్ హాస్పటల్ ప్రాంగణంలో ఒకటి.. ఈ మధ్యనే గడ్డి అన్నారం నుంచి షిప్టు చేసిన ప్రూట్ మార్కెట్ ప్రాంగణంలో మరొకటి..  మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో అల్వాల్ నుంచి ఓఆరార్ మధ్యలో ఇంకొకటి.. మొత్తం 3 కొత్త సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లను, టిమ్స్  కలిపి నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. 
అలాగే కొత్తపేట లో ప్రస్థుతం వున్న కూరగాయల మార్కెట్ ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ గా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి, కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ చర్చించిన అంశాలు
రాష్ట్రంలో గత సంవత్సరం వరిధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నుల పై చిలుకుగా ఉందని, వ్యవసాయ శాఖ కేబినెట్ కు తెలిపింది. ఈసారి ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే 60 శాతం ఎక్కువ వానలు పడ్డాయని, గత సంవత్సరం కంటే 5 శాతం ఎక్కువగా వర్షాపాతం నమోదయ్యిందని , వ్యవసాయ శాఖ.. కేబినెట్ కు వివరించింది.
ముగిసిన సీజన్ లో పండిన 1.4 కోట్ల వరి ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని., 1.6 కోట్ల టన్నుల ధాన్యాన్ని వ్యాపారులు కొన్నారని మార్కెటింగ్ శాఖ వివరించింది.
5145 కోట్ల రూపాయలు రైతుబంధు పైసలు రైతుల ఖాతాల్లో జమయ్యాయని వ్యవసాయ శాఖ తెలిపింది. 
ప్రభుత్వ ఆదేశాల మేరకు, కరోనా కష్టకాలంలో కూడ ధాన్యం సేకరణను రికార్డు స్థాయిలో జరిపిన పౌర సరఫరా, గ్రామీణాభివృద్ధి మరియు సంబంధిత శాఖల అధికారులను సిబ్బందిని, కేబినెట్ అభినందించింది. 
గొర్ల పెంపకం వృత్తిలో వున్న యాదవులకు గొర్ల పెంపకం పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. 
అలాగే క్షవర వృత్తిలో వున్న నాయీ బ్రాహ్మణులకోసం గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను తక్షణమే ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
చేనేత మరియు గీత కార్మికులకు త్వరిత గతిన బీమా అందించడానికి చర్యలు తీసుకోవాలని, మత్స్య కార్మికులకు, గీత కార్మికులకు అందించాల్సివున్న ఎక్స్ గ్రేషియా ను వెంటనే విడుదల చేయాలని., వివిధ వృత్తి కులాలకు ఎంబీసీ కర్పోరేషన్ కు నిధులు విడుదల చేయాలని కేబినెట్ ఆదేశించింది. 
రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగానే,  వృత్తి కులాలకు కూడా సత్వరమే బీమా చెల్లింపులు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.