- కంపెనీలకు రూ.17 వేల కోట్ల రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్ అనుమతి
- ఆరేళ్లలో రూ.2,430 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని అంచనా
- రూ. 3.35 లక్షల కోట్ల ప్రొడక్షన్, 75 వేల జాబ్స్ క్రియేట్ అవుతాయంటున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఐటీ హార్డ్వేర్ సెక్టార్లో తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్ సక్సెస్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఇదే సెక్టార్లో పీఎల్ఐ 2.0 ని తెచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్లో కొత్త పీఎల్ఐ కింద రూ. 17 వేల కోట్లను రాయితీగా ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. పీఎల్ఐ 1.0 కింద దేశంలో ఐటీ హార్డ్వేర్ ప్రొడక్ట్ల తయారీ బాగా పెరిగిందని చెప్పాలి. ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ గత ఆరేళ్లలో ఏడాదికి 17 శాతం వృద్ధి సాధించింది. ఈ ఏడాది రూ.9 లక్షల కోట్ల మాన్యుఫాక్చరింగ్ వాల్యూని దాటింది. ‘ఐటీ పీఎల్ఐ కింద రూ.17 వేల కోట్లను ఖర్చు చేయనున్నాం. ఈ ప్రోగ్రామ్ కాల పరిమితి ఆరేళ్లు’ అని యూనియన్ ఐటీ అండ్ టెలికం మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
పీఎల్ఐ 2.0 కింద ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్స్, పీసీ (పర్సనల్ కంప్యూటర్లు) లు, సర్వర్లు, చిన్న ఫాక్టర్ డివైజ్లను లోకల్గా తయారు చేసే కంపెనీలకు రాయితీలు ఇస్తారు. ఈ కొత్త పీఎల్ఐ స్కీమ్ వలన ఐటీ హార్డ్వేర్ సెక్టార్లో అదనంగా రూ.3.35 లక్షల కోట్ల ప్రొడక్షన్ జరుగుతుందని, రూ.2,430 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని, డైరెక్ట్గా 75 వేల మందికి ఉద్యోగాలొస్తాయని వైష్ణవ్ వివరించారు. కాగా, ఐటీ హార్డ్వేర్ సెక్టార్లో 2021 లో పీఎల్ఐ స్కీమ్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ స్కీమ్ కింద ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, పీసీలు, సర్వర్లను తయారు చేసే కంపెనీలకు రూ.7,350 కోట్ల రాయితీని ప్రకటించారు. ఈ స్కీమ్ కింద ఇచ్చే రాయితీలను పెంచాలని ఇండస్ట్రీ వర్గాలు కోరడంతో ప్రభుత్వం పీఎల్ఐ 2.0 ని తీసుకొచ్చింది. పీఎల్ఐ స్కీమ్ను 2020 లో మొదటిసారిగా తెచ్చారు. మొదట మొబైల్ ఫోన్ల తయారీలో ఈ స్కీమ్ అమలు చేయగా, దేశంలో వీటి తయారీ భారీగా పెరిగిందని చెప్పొచ్చు. మొబైల్ ఫోన్లు తయారు చేస్తున్న దేశాల్లో ఇండియా రెండో ప్లేస్కు ఎగిసింది. దేశం నుంచి ఈ ఏడాది మార్చిలో రూ.90 వేల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతి అయ్యాయంటేనే అర్థం చేసుకోవచ్చు.
చైనా నుంచి కంపెనీలను ఆకర్షించేందుకు..
గ్లోబల్ కంపెనీలు తమ మాన్యుఫాక్చరింగ్ బేస్ను చైనా నుంచి ఇండియాకు షిఫ్ట్ చేసుకోవడంలో కొత్త పీఎల్ఐ స్కీమ్ పెద్ద పాత్ర పోషిస్తుందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. పీసీలు, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లను ఇండియాలో అసెంబుల్ చేసుకునేందుకు కంపెనీలు తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ‘నేను యూఎస్లో పర్యటించినప్పుడు హెచ్పీ, డెల్ వంటి కంపెనీల ఎగ్జిక్యూటివ్లతో మాట్లాడా. ఈ కంపెనీలు ఇండియాకు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ఏసర్, ఆసుస్ వంటి కంపెనీలు ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లు పెట్టాలని చూస్తున్నాయి. దేశ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ విస్తరిస్తోంది. మన కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్లు ఇటువంటి ఎకోసిస్టమ్ను డెవలప్ చేస్తున్నారు. ప్రతీ నెల కొత్త ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్) కంపెనీ పుట్టుకొస్తుండడం చూస్తున్నాం’ అని వైష్ణవ్ వివరించారు.
డిక్షన్, శాన్మినా, వివిడీఎన్ వంటి చాలా కంపెనీలు ఇండియాలో ఉన్నాయన్నారు. చైనా నుంచి తమ మాన్యుఫాక్చరింగ్ బేస్ను ఇండియాకు షిఫ్ట్ చేసుకునేలా గ్లోబల్ కంపెనీలను ఎంకరేజ్ చేస్తున్నామని, ఈ కొత్త పీఎల్ఐ స్కీమ్ మిగిలిన స్కీమ్ల కంటే భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. లోకల్ కంపెనీలతో కలిసి ఇండియాలో ఆపరేట్ చేయాలనుకునే చైనా కంపెనీలతో తమకు ఎటువంటి ఇబ్బంది లేదని వివరించారు. ఐటీ హార్డ్వేర్ సెక్టార్లో ల్యాప్టాప్లు, పీసీలు, ట్యాబ్లెట్లు, ఎడ్జ్ కంప్యూటర్ల తయారీపై ఎక్కువ ఫోకస్ పెట్టామని అన్నారు. వీటి తయారీని పెంచేందుకు పీఎల్ఐ కింద సప్లయ్ చెయిన్ను పెంచుతున్నామని వెల్లడించారు. టెలికం సెక్టార్లో పీఎల్ఐ కింద మొదటి ఏడాది రూ.1,600 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయన్నారు.