బీజాపూర్: భద్రతా విధుల్లో ఉన్న చత్తీస్ గఢ్ ఆర్మ్ ఫోర్స్ (సీఏఎఫ్) కమాండర్ ను మావోయిస్టులు గొడ్డలితో నరికి చంపారు. చత్తీస్ గఢ్ లో బీజాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ ఘటన జరిగింది. కుర్తు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆ గ్రామంలో భద్రతా విధుల కోసం సీఏఎఫ్ బృందాన్ని తరలించారు.
బృందానికి నాయకత్వం వహిస్తున్న కమాండర్ తిజావు రామ్ భౌర్య గ్రామంలోని మార్కెట్ లో విధుల్లో ఉండగా కొంతమంది మావోయిస్టులు అకస్మాత్తుగా ఆయనపై గొడ్డలితో దాడిచేసి పారిపోయారు. భౌర్య తీవ్రంగా రక్తమోడుతూ అక్కడికక్కడే చనిపోయారు. సీఏఎఫ్లోని నాలుగో బెటాలియన్ లో ఆయన పనిచేస్తున్నారు. ఆయన హత్య గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.