టర్కీ, అజార్ బైజాన్‎కు దెబ్బ మీద దెబ్బ.. రెండు దేశాలతో CAIT వాప్యార సంబంధాలన్నీ కట్

టర్కీ, అజార్ బైజాన్‎కు దెబ్బ మీద దెబ్బ.. రెండు దేశాలతో  CAIT  వాప్యార సంబంధాలన్నీ కట్

న్యూఢిల్లీ: భారత్‎తో ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్‎కు అండగా నిలిచిన టర్కీ, అజార్ బైజాన్ దేశాలకు దెబ్బ మీద దెబ్బలు తగులున్నాయి. పాక్‏కు ఏకపక్ష మద్దతు ప్రకటించి.. భారత్‎పై విషం కక్కిన ఈ రెండు దేశాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తోంది. కొన్ని ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు ఆ రెండు దేశాలతో వ్యాపారాన్ని తెంచేసుకుని పర్యాటకపరంగా దెబ్బకొట్టాయి. ఇదిలా ఉండగానే.. టర్కీ, అజార్ బైజాన్‎ దేశాలకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) బిగ్ షాక్ ఇచ్చింది.

 దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం (మే 16)  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ వాణిజ్య సమావేశం నిర్వహించారు. దేశంలోని 24 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో భారత్‎కు వ్యతిరేకంగా నిలబడే దేశాలకు తగిన బుద్ధి చెప్పాలని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే.. టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాలతో భారతదేశ వ్యాపార సంఘం అన్ని వాణిజ్య, వ్యాపార సంబంధాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేశాయి.

 దేశవ్యాప్తంగా ఉన్న 125 మందికి పైగా అగ్రశ్రేణి వాణిజ్య నాయకులు ఈ తీర్మానాన్ని ఏకగీవ్రంగా ఆమోదించారు. ప్రయాణం, పర్యాటకం వంటి రంగాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా భారత్ చిరకాల శత్రువుకు మద్దతుగా నిలబడ్డ  టర్కీ, అజర్‌బైజాన్‌లో ఎటువంటి సినిమాలు చిత్రీకరించవద్దని సీఏఐటీ భారతీయ చలనచిత్ర పరిశ్రమను విజ్ఞప్తి చేసింది. ఒకవేళ అక్కడ ఏవైనా సినిమాలు చిత్రీకరిస్తే ఆ చిత్రాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. 

Also Read : ఎడాపెడా రియల్టీ ప్రాపర్టీలు కొంటున్న ఎన్ఆర్ఐలు

ఈ సమావేశంలో ప్రధాని మోడీకి సంఘీభావం తెలిపిన సీఏఐటీ.. భారతదేశానికి వ్యతిరేకంగా నిలబడే ఏ శక్తులనైనా తీవ్రంగా వ్యతిరేకిస్తామని ప్రతిజ్ఞ చేశారు. టర్కీ, అజార్ బైజాన్ దేశాలకు సంక్షోభ సమయాల్లో  ప్రధాని మోడీ అందించిన మానవతా, దౌత్య సహాయాన్ని మర్చిన ఈ రెండు దేశాల తీరును ద్రోహ చర్యగా సీఏఐటీ అభివర్ణించింది.  

ఈ సందర్భంగా సీఏఐటీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, భారత సద్భావన, సహాయం పొందిన టర్కీ, అజర్‌బైజాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం చాలా దురదృష్టకరమని విమర్శించారు.  వారి వైఖరి భారతదేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలపై ప్రత్యక్ష దాడి అని అభివర్ణించారు. ఈ రెండు దేశాల తీరు 1.4 బిలియన్ భారతీయుల మనోభావాలను అవమానించడమేనని ఫైర్ అయ్యారు.