
- వికారాబాద్ డీఈవో 9 ఏండ్లుగా అక్కడే
- ట్రాన్స్ ఫర్లు చేపట్టాలని పలువురి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జిల్లా విద్యా శాఖాధికారుల (డీఈవోల) బదిలీలను ఆ శాఖ మరిచిపోయింది. అవసరాల మేరకు సర్దుబాటు చేస్తూ చేతులు దులుపుకుంటున్నది తప్ప ఏండ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారికి మాత్రం స్థానచలనం కల్పించడం లేద. రాష్ట్రంలోని హైదరాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే రెగ్యులర్ డీఈవోలు కొనసాగుతున్నారు. మిగిలిన 30 జిల్లాలకు ఇన్ చార్జీలే ఉన్నారు.
అయితే.. వీరిలో రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, హన్మకొండ, వికారాబాద్ జిల్లాలకు డిప్యూటీ ఈవోలు ఇన్ చార్జి జిల్లా విద్యా శాఖాధికారులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ చార్జీ డీఈవోలనూ ఉన్నతాధికారులు కొన్నేండ్లుగా ఒకేచోట కంటిన్యూ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా డీఈవో గత 9 ఏళ్లుగా అదే స్థానంలో కొనసాగుతున్నారు. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని జిల్లాల్లోనూ నాలుగైదు ఏండ్లుగా వాళ్లే పనిచేస్తున్నారు.
మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, నల్గొండ, ములుగు, సూర్యాపేట, పెద్దపల్లి తదితర జిల్లాల్లోని డీఈవోలు నాలుగైదు ఏండ్లుగా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. జిల్లా స్థాయి అధికారులు గరిష్టంగా మూడేండ్ల పాటు ఒకేచోట పనిచేయాలనే నిబంధన ఉందని అధికారులు చెప్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. కానీ, వికారాబాద్ డీఈవోను ఒకేచోట 9 ఏండ్లుగా కొనసాగించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. మరోవైపు బదిలీలు చేపట్టాలని పలువురు డీఈవోలు కోరుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే వాదనలున్నాయి. ఇప్పటికైనా ప్రమోషన్ల ద్వారానైనా బదిలీలు చేయాలని టీచర్ల సంఘాల నేతలు కోరుతున్నారు.