జోథ్పూర్: సిటిజన్షిప్ సవరణ చట్టం (సీఏఏ) మైనార్టీలకు వ్యతిరేకంకాదన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా… దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విత్ డ్రా చేయబోమని మరోసారి చెప్పారు. దేశమంతటా సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ చట్టంపై ప్రజలకు ఉన్న అపోహల్ని తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తోంది. దీంట్లో భాగంగా రాజస్థాన్ జోథ్పూర్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన సభలో అమిత్ షా మాట్లాడారు. “ తృణమూల్ కాంగ్రెస్ , ఎస్పీ, , బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాలు సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి”అని ఆయన అన్నారు. “మీకు దమ్ముంటే నాతో డిబేట్ చేద్దురుగాని రండి. అలా కాదు అంటే చట్టాన్ని ఇటాలియన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడానికి కూడా రెడీనే.. అప్పుడు మీరు దాన్ని (చట్టాన్ని) చదువుకోవచ్చు”అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీపై పరోక్షంగా సెటైర్ వేశారు. యూత్ను తప్పుదోవ పట్టించడం వల్లే వాళ్లంతా రోడ్లమీదకు వస్తున్నారని అన్నారు. మైనార్టీలు, యూత్కు నిజమేంటో చెబుతామని అమిత్ షా చెప్పారు.
రేపటి నుంచి సీఏఏపై ‘ఇంటింటికీ బీజేపీ’
న్యూఢిల్లీ: సీఏఏపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ చీఫ్ అమిత్ షా మరో ప్లాన్ రెడీ చేశారు. ఈ నెల 5వ తేదీ (ఆదివారం) నుంచి పది రోజులపాటు పార్టీ లీడర్లంతా ఇంటింటికీ వెళ్లి సీఏఏపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. అమిత్ షా ఢిల్లీలో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఘజియాబాద్లో, లక్నోలో రాజ్నాథ్ సింగ్, నాగ్పూర్లో నితిన్ గడ్కరీ, జైపూర్లో నిర్మలా సీతారామన్ ఆదివారం ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ జనరల్ సెక్రటరీ అనిల్ జైన్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. వీరంతా ఒక్కో ఇంటికి వెళ్లి సీఏఏపై ఏమనుకుంటున్నారో తెలుసుకుంటారని, అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఎన్పీఆర్, ఎన్నార్సీ.. ఏదైనా ఇండియన్ ముస్లింలకు ఏ ఇబ్బందీ ఉండదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనిల్ జైన్ చెప్పారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)ను పార్టీ మ్యానిఫెస్టోలో పెడుతున్న సమయంలోనే అనేక విధాలుగా ఆలోచన చేశామన్నారు.