కల్గరీ: కెనడా ఓపెన్లో ఇండియన్ షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. టాప్ సీడ్ ప్లేయర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ రెండో రౌండ్లోకి ప్రవేశించగా, సాయి ప్రణీత్, రుత్వికా శివాని ఇంటిముఖం పట్టారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–16, 21–9తో తలియా ఎన్జీ (కెనడా)పై గెలిచింది. 36 నిమిషాల మ్యాచ్లో తెలుగమ్మాయి అద్భుతమైన ర్యాలీలతో ఆకట్టుకుంది.
తొలి గేమ్ హోరాహోరీగా సాగినా, 13–13 వద్ద స్కోరు సమం చేసిన సింధు వరుస పాయింట్లతో హోరెత్తించింది. రెండో గేమ్లో సింధుదే పూర్తి ఆధిపత్యం నడిచింది. మరో మ్యాచ్లో గద్దె రుత్వికా శివాని 12–21, 3–21తో సుపానిందా కటెతోంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓడింది. మెన్స్ సింగిల్స్లో లక్ష్యసేన్ 21–18, 21–18తో రెండోసీడ్ కున్లావత్ విటిసరన్ (థాయ్లాండ్)పై నెగ్గగా, సాయి ప్రణీత్ 12–21, 17–21తో యెగార్ కోలెహో (బ్రెజిల్) చేతిలో పరాజయం పాలయ్యాడు.