మున్సిపల్ ట్యాక్స్ కట్టేందుకు లీడర్ల క్యూ

మున్సిపల్ ట్యాక్స్ కట్టేందుకు లీడర్ల క్యూ
  • ఎన్నికల్లో పోటీకి బకాయిలుఉండొద్దన్న రూల్
  • ఎన్ వోసీ కోసం పెండింగ్ ట్యాక్స్కడుతున్న నేతలు
  • చాలా మున్సిపాల్టీల్లో వారంలోభారీగా పెరిగిన వసూళ్లు

హైదరాబాద్, వెలుగు: కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్న ఆశావహులు మున్సిపాల్టీల్లో పెండింగ్​ ట్యాక్సులు కట్టేందుకు క్యూ కడుతున్నారు. దీంతో వారం రోజులుగా చాలా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు భారీగా ట్యాక్సులు వసూలవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి మంచిర్యాల జిల్లాలో రూ.17.60 లక్షల ఇంటిపన్ను, రూ.13.20 లక్షల నల్లా బిల్లులు వసూలైనట్లు అధికారులు చెబుతున్నారు. నో అబ్జక్షన్ సర్టిఫికెట్ల(ఎన్ వోసీ) కోసం ఇప్పటివరకు 500 అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కో ఎన్ వోసీకి రూ.1,000 చొప్పున మరో రూ.5 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ఈ నెల 22న 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్​ షెడ్యూల్​ రిలీజ్ చేసింది.

అన్ని చోట్లా పెరిగిన వసూళ్లు

ఏటా ట్యాక్స్ లు వసూలు చేయటంలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రకటనలు జారీ చేసినా, నోటీసులు ఇచ్చినా బకాయిలు వసూలు కావటంలేదు. కొన్ని మున్సిపాల్టీల్లో 30 శాతం కూడా పన్నులు వసూలు కాని పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే సదరు మున్సిపాల్టీకి ఎటువంటి ట్యాక్స్ బకాయి ఉండకూడదు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారు బకాయిలు చెల్లించి ఎన్ వోసీ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. సంగారెడ్డి మున్సిపాల్టీకి ఐదు రోజుల్లో రూ.10.69 లక్షలు వసూలైనట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్​ కార్పొరేషన్​కు ఐదు రోజుల్లో రూ.24.19 లక్షలు వసూలయ్యాయి. ఆదివారం రిజర్వేషన్లు ఖరారయ్యాక సోమవారం ఒక్కరోజే రూ.10 లక్షలు వసూలైంది. సూర్యాపేట మున్సిపాల్టీలో రూ.6 లక్షల ఆస్తి పన్ను వసూలైంది. జవహర్​నగర్​ కార్పొరేషన్ కు రూ.9 లక్షల ఆస్తిపన్ను వసూలైంది. మిర్యాలగూడ మున్సిపాల్టీలో ఆరు రోజుల్లో రూ.6.31లక్షలు వసూలయ్యాయి. సోమవారం ఒక్కరోజే మీర్ పేట్ కార్పొరేషన్​లో రూ.1.10 లక్షలు, మేడ్చల్ మున్సిపాల్టీలో రూ.2,10,950, వనపర్తి మున్సిపాల్టీలో రూ.2,29 లక్షలు, బడంగ్​పేట కార్పొరేషన్ లో రూ.1.20 లక్షలు, భూపాలపల్లి మున్సిపాల్టీలో రూ.3 లక్షలు, పెద్ద అంబర్ పేట్ మున్సిపాల్టీలో రూ.1.40 లక్షలు, రామగుండం కార్పొరేషన్‌‌‌‌లో రూ.2.10 లక్షలు వసూలయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చాలా మున్సిపాల్టీల్లో వంద శాతం పన్నులు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు.