విశాఖపట్నం టు జగిత్యాల.. బైక్​పై గంజాయి

విశాఖపట్నం టు జగిత్యాల.. బైక్​పై గంజాయి
  • ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు.. 10 కిలోల గంజాయి స్వాధీనం 
  • మత్తుకు బాలికలు బానిసలైన ఘటనతో పోలీసులు అప్రమత్తం
  • బాలికల ఘటనపైనా దర్యాప్తు మొదలుపెట్టామని జగిత్యాల ఎస్పీ వెల్లడి

జగిత్యాల, వెలుగు: స్కూల్ పిల్లలకు గంజాయి అలవా టు చేసి, సెక్స్ రాకెట్ నడుపుతున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో జగిత్యాల పోలీసులు అప్రమత్తమయ్యారు. గంజాయి ముఠాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను శనివారం జగిత్యాల జిల్లా పోలీస్ ఆఫీసులో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. 

రాయికల్ కు చెందిన పెనుగొండ గణేశ్ బీటెక్ చదివేటప్పుడు గంజాయికి అలవాటు పడ్డాడు. ఏపీలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన వ్యక్తితో పరిచయం పెంచుకుని సీలేరు నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నాడు. గంజాయికి బానిసై బీటెక్ ను మధ్యలోనే ఆపేసిన గణేశ్.. ఆ తర్వాత డెయిరీ ఫామ్ పెట్టి నష్టపోయాడు. ఈ క్రమంలో అతనికి రాయికల్ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మాలవత్ సతీశ్ కుమార్, రావులకారి నితిన్, తోట అజయ్, ఆవుల సాగర్ పరిచయమయ్యారు. జల్సాలకు అలవాటుపడ్డ వీళ్లు.. తమ వద్ద డబ్బులు లేకపోవడంతో సీలేరులో గంజాయి కొనుగోలు చేసి జగిత్యాల జిల్లాలో అమ్మకాలు చేస్తూ దందాకు తెరలేపారు. 

గంజాయి తీసుకొస్తామని చెప్పి నితిన్, అజయ్, సాగర్ మరికొంత మంది దగ్గర గణేశ్, సతీశ్ డబ్బులు తీసుకున్నారు. గజాయి తీసుకొచ్చేందుకు వీళ్లిద్దరూ డ్యూక్ కేటీఎం -200 బైక్ పై సీలేరుకు వెళ్లారు. అక్కడ రాజు అనే వ్యక్తి దగ్గర దాదాపు10 కిలోల గంజాయి కొనుగోలు చేసి తీసుకొచ్చారు. దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి రాయికల్, మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారు. 

అయితే శనివారం రాయికల్, మల్లాపూర్ లో పోలీసులు నిర్వహించిన వేర్వేరు తనిఖీల్లో గంజాయితో సహా ఐదుగురు పట్టుబడ్డారు. విచారణలో నేరం ఒప్పుకున్నారు. వీరి దగ్గరి నుంచి 10 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్లు, 2 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏ1గా- పెనుగొండ గణేశ్, ఏ2- మాలవత్ సతీశ్ కుమార్, ఏ3- రావులకారి నితిన్, ఏ4- తోట అజయ్, ఏ5- ఆవుల సాగర్ గా కేసు నమోదు చేశారు.  

మైనర్ల ఘటనపైనా దర్యాప్తు చేస్తున్నం: ఎస్పీ 

హైస్కూల్ బాలికలు గంజాయికి బానిసలయ్యారనే ఘటనపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘కొన్ని న్యూస్ సంస్థలు వ్యూయర్ షిప్ కోసం సెన్సెషనల్ గా న్యూస్ రాస్తున్నాయి’’ అని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. 

ధరూర్​లో మరొకరు అరెస్టు.. 

జగిత్యాల శివారులోని ధరూర్ వద్ద గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ధరూర్‌‌ గ్రామ శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.  అక్కడ అనుమానాస్పదంగా తిరు గుతున్న మైదం అజయ్‌‌ను అదుపు లోకి తీసుకుని విచారించారు. అతని వద్ద 260 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితు డిపై కేసు నమోదు చేసి, జ్యూడీషియల్ రిమాండ్ కు పంపినట్టు జగిత్యాల రూరల్ సీఐ ఆరిఫ్ అలీఖాన్ తెలిపారు.