డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి: డెడ్ బాడీలను తరలిస్తుండగా మరో ప్రమాదం..!

డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి: డెడ్ బాడీలను తరలిస్తుండగా మరో ప్రమాదం..!

సిద్దిపేట జిల్లా: ప్రమాదవశాత్తు కారు డివైడర్ ను ఢీకొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, డెడ్ బాడీలను పోస్ట్ మార్టమ్ కోసం హాస్పిటల్ కి తరలిస్తుండగా పోలీసుల వాహనానికి డీసీఎం ఢీకొట్టింది. దీంతో సీఐతో పాటు కానిస్టేబుల్స్, 10 మంది స్థానికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హాస్పిటల్స్ కి తరలించిన పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ సంఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా, రాజీవ్ రహదారిపై జరుగగా స్థానికంగా విషాదాన్ని నింపింది.

మృతులు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు.  రాణాపూర్‌ గ్రామానికి చెందిన  భయపు విజయ (58)  అనారోగ్యానికి గురికావడంతో భర్త భయపు రాజిరెడ్డి (62)తో కలిసి కరీంనగర్ ‌కు వెళ్లారు. అక్కడి నుంచి  హుజురాబాద్ ‌లో ఉంటున్న కుమారుడు భయపు నరేందర్ రెడ్డి (39) వద్దకు వెళ్లి ముగ్గురు కలిసి కారులో హైదరాబాద్ ‌కు బయల్దేరారు. సిద్దిపేట జిల్లా కేంద్ర శివారులో కారు అదుపుతప్పి డివైడర్‌ ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలై ముగ్గురు ఘటనాస్థలంలోనే చనిపోయారని తెలిపారు పోలీసులు.