మంత్రి కొడుక్కి కారు లంచం

మంత్రి కొడుక్కి కారు లంచం

విశాఖపట్టణం: ఏపీ కార్మిక శాఖా మంత్రి  గుమ్మనూరు జయరామ్ పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎస్ ఐ స్కామ్ లో మంత్రి  కొడుక్కి కారు లంచం ఇచ్చారంటూ.. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు. మీడియా సమావేశం మధ్యలో ఏసీబీ కాల్ సెంటర్ కు ఫోన్ చేసిన అయ్యన్నపాత్రుడు ప్రస్తుత మంత్రి జయరాం, ఆయన తనయుడు ఈశ్వర్ పై లంచం ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఓ ముద్దాయి మంత్రి కొడుకు ఈశ్వర్ కు బెంజ్ కారు ఇచ్చాడని.. అది పుట్టినరోజు కానుక కాదు లంచం అని పేర్కొన్నారు. ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సంస్థలో అవినీతి జరిగిందని, అందులో మంత్రి జయరాం, ఆయన తనయుడు ఈశ్వర్ ల ప్రమేయం ఉందన్నారు. అవినీతి జరిగితే ఏసీబీ కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోందని, ఇప్పుడీ ఈఎస్ఐ స్కాంలోనూ పరిష్కారం వస్తుందని భావిస్తున్నానని మాజీ మంత్రి అయ్యన్న పేర్కొన్నారు.

ఈఎస్ఐ స్కాంలో ఏ14 ముద్దాయిగా ఉన్న తెలకపల్లి కార్తీక్ అనే వ్యక్తి మంత్రి జయరాం తనయుడు ఈశ్వర్ కు బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారని.. మంత్రికి బినామీ కాబట్టే సదరు ఏ14 ముద్దాయి ఖరీదైన కారు గిఫ్టుగా ఇచ్చారని, మంత్రి కుమారుడి బర్త్ డే సందర్భంగా ఇచ్చింది కానుక కాదని లంచం అని ఆరోపించారు. ఆ ఏ14 ముద్దాయికి మంత్రి కుమారుడికి ఏంటి సంబంధం అని ప్రశ్నించిన ఆయన ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వం వేసే కమిటీకి దీనిపై ఆధారాలు అందించడానికి తాము సిద్ధమేనని అన్నారు.  అంతకుముందు ఎలాంటి ఆధారాలు లేకపోయినా టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని, అన్ని ఆధారాలు ఉన్న పరిస్థితుల్లో మంత్రి గుమ్మనూరు జయరాంను పదవిలో కొనసాగించడం తగదని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మంత్రి కుమారుడు ఈశ్వర్ కు బెంజ్ కారు కానుకగా ఇస్తున్న ఫొటోను కూడా విడుదల చేశారు.

రుజువు చేస్తే రాజీనామా: మంత్రి గుమ్మనూరు జయరామ్

టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనపై చేసిన ఆరోపణలపై మంత్రి గుమ్మనూరు జయరామ్ స్పందించారు. కారు తమదేనని రుజువు చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. కారు వద్ద ఫోటో దిగడం తప్పా.. ఫోటో దిగితే కారు సొంతమైపోతుందా.. హెలికాఫ్టర్ దగ్గర.. రైలు దగ్గర ఫోటోలు తీసుకుంటే మనవై పోతాయా అని ప్రశ్నించారు.  నా కొడుక్కి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో అభిమానులు ఉన్నారు.. ఎంతో మంది ఫోటోలు తీసుకుంటూ ఉంటారని వివరించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చెబుతున్న కారు తో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు.. పార్టీ నేతలకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.