కారులో మంటలు.. సెక్రటేరియట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

కారులో మంటలు.. సెక్రటేరియట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

బషీర్​బాగ్, వెలుగు:  కారులో మంటలు చెలరేగిన ఘటన సైఫాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్రటేరియట్ ఉద్యోగి రవీందర్ గురువారం సాయంత్రం డ్యూటీ ముగించుకొని కారులో తన సహోద్యోగితో కలిసి ఇంటికి బయలుదేరాడు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పైకి ఎక్కుతున్న టైమ్ లో కారు బానెట్ లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన రవీందర్ వెంటనే వెహికల్ ను పక్కకు ఆపాడు. 

బానెట్ నుంచి మంటలు చెలరేగడంతో అతడితో పాటు సహోద్యోగి కారు నుంచి బయటికి దిగారు. మంటల తీవ్రత ఎక్కువై క్షణాల్లో కారు ముందు భాగం కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. సెక్రటేరియట్ సమీపంలో ఈ ఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని క్రేన్ సాయంతో కారును పక్కకు తొలగించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైఫాబాద్ పోలీసులు తెలిపారు.