హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు డ్రైవర్ రూ.7 కోట్ల విలువైన వజ్రాభరణాలతో పరారయ్యాడు. మాదాపూర్లోని మైహోం భుజ అపార్ట్మెంట్స్లో ఆభరణాల వ్యాపారం రాధిక అనే యువతి, అదే అపార్ట్మెంట్స్లో ఉండే అనూషకు రూ.50 లక్షల విలువైన జ్యువెల్లరీని ఆర్డర్ చేశారు. నిన్న సాయంత్రం మధురానగర్లో బంధువుల ఇంటికి వెళ్లిన అనూష.. నగలను అక్కడికే పంపమని చెప్పారు. దీంతో సేల్స్మెన్ అక్షయ్ (30)కి ఆ నగలిచ్చి తన కారులో డ్రైవర్ శ్రీనివాస్ (26)ను తోడుగా పంపించారు. మధురానగర్ చేరుకున్న తర్వాత డ్రైవర్ శ్రీనివాస్ కారులో ఉండగా, అక్షయ్ నగలను తీసుకెళ్లి అనూషకు ఇచ్చి తిరిగి వచ్చి చూస్తే కారు లేదు. అయితే అప్పటికే సిరిగిరిరాజు జెమ్స్ అండ్ జువెల్లర్స్కు ఇవ్వాల్సిన రూ.7 కోట్ల విలువైన వజ్రాభరణాలు కారులోనే ఉన్నట్టు అక్షయ్ గమనించి, విషయాన్ని వెంటనే రాధికకు తెలియజేశారు. ఆ తర్వాత ఆమె ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.