జర్మనీ శాస్త్రవేత్తల కొత్త రీసెర్చ్
మోకాలి చిప్ప రిపేర్దిశగా ముందడుగు
మోకాలిచిప్పలు అరిగితే నిలబడటం, కూర్చోవడం, నడవడం కూడా కష్టమైపోతుంది. కనీసం చిన్నచిన్న పనులు చేసుకోవాలన్నా, పంటి బిగువున నొప్పిని భరించక తప్పదు. మరేం చేయాలి? రోజూ నొప్పి మందులు వేసుకోవాల్సిందేనా? కొత్త మోకాలి చిప్పను మార్చుకోక తప్పదా? ఆ అవసరం ఇక ఉండదంటున్నారు జర్మనీ సైంటిస్టులు. మోకాలి చిప్ప అరిగిపోయిన చోట కొత్త కార్టిలేజ్కణాలను సూది ద్వారా ఇస్తే చాలంటున్నారు. అరిగిపోయిన కార్టిలేజ్ తిరిగి రిపేర్ అయిపోతుందని చెబుతున్నారు. హీడల్ బర్గ్ యూనివర్సిటీకి చెందిన 71 మంది టీనేజర్లపై చేసిన పరిశోధనలో మంచి ఫలితాలు వచ్చాయని వారు వెల్లడించారు.
కార్టిలేజ్ అనేది మెత్తగా ఉండే ఎముక. దీన్నే మృదులాస్థి అని అంటారు. కీళ్ల మధ్య రాపిడి జరగకుండా చూస్తుంది. ఇది అరిగిపోతే కీలు కదిలినప్పుడు ఎముకల మధ్య రాపిడి జరిగి నొప్పి ఏర్పడుతుంది. ఆర్థ్రైటిస్ లేదా ఆస్టియో ఆర్థ్రైటిస్ కారణంగా ఇది అరిగిపోతుంటుంది. దీనిని రిపేర్ చేసేందుకు ప్రస్తుతం మైక్రోఫ్రాక్చర్ అనే పద్ధతిని కూడా ఉపయోగిస్తున్నారు. ఇందులో కార్టిలేజ్ దెబ్బతిన్న చోట ఎముకకు డ్రిల్లింగ్ చేసి, రంధ్రాలు చేస్తారు. ఆ రంధ్రాల్లోకి రక్తం ప్రవహించి, రక్తంలోని మూలకణాల వల్ల సహజంగానే కార్టిలేజ్ తిరిగి ఏర్పడేందుకు చాన్స్ ఉంటుంది. కానీ, ఈ పద్ధతిలో ఫలితం తక్కువ. అందుకే.. తాము ఈ కొత్త పద్ధతిని కనిపెట్టామని జర్మనీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈ పద్ధతిలో కార్టిలేజ్లోని కాండ్రోసైట్కణాలను సేకరించి, ల్యాబ్లో ఏడు వారాలపాటు విభజన చెందేలా చేశారు. విభజన చెందిన కార్టిలేజ్కణాలు ఒకదానికొకటి అతుక్కునిపోతూ చిన్న చిన్న గోళాకారపు అణువుల్లా మారిపోయాయి. వాటిని తీసుకుని రోగుల మోకాలిలో కార్టిలేజ్ దెబ్బతిన్న చోట సూది ద్వారా పంపించారు. దీంతో కొన్ని రోజుల్లోనే దృఢమైన కార్టిలేజ్ తిరిగి ఏర్పడింది. నొప్పి పూర్తిగా మాయం అయిపోయింది. అయితే, యుక్త వయసులో ఉన్నవారికి, సొంత కార్టిలేజ్కణాలను ఎక్కించే వారికి మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. అరవై ఏండ్లు దాటిన 10% మగవాళ్లు, 13% ఆడవాళ్లను మోకాలి సమస్యలు వేధిస్తున్నాయి.
