
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారీగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు నమోదైన కేసుల వివరాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఒక్క రోజులో కొత్తగా నమోదైన 216 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పేషెంట్ల సంఖ్య 5029కి పెరిగింది. వారిలో 64 మంది కోలుకోవడంతో.. ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,775కు చేరింది. గడిచిన 24 గంటల్లో అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా వల్ల మరణించారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో కరోనా మృతుల సంఖ్య 77కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వేర్వేరు కోవిడ్ ఆస్పత్రుల్లో 2,177 మంది చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో 3990 మంది లోకల్స్ కాగా, ఇటీవల విదేశాల నుంచి వెనక్కి తీసుకుని వచ్చిన వారు 132 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 907 మంది కరోనా బారినపడ్డారు. అయితే గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల్లో 147 మంది లోకల్స్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 69 మంది ఉన్నారు. అలాగే డిశ్చార్జ్ అయిన వారిలో 16 మంది లోకల్స్ కాగా, 48 మంది ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు ఉన్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.