కోడ్​ ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు: సీఐ రాజిరెడ్డి

కోడ్​ ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు: సీఐ రాజిరెడ్డి

ఖమ్మం రూరల్​, వెలుగు: ఎన్నికల కోడ్​ ఉల్లంఘించిన పలువురిపై ఖమ్మం రూరల్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. సీఐ రాజిరెడ్డి తెలిపిన ప్రకారం  మండలంలోని దారేడు గ్రామంలో శుక్రవారం అనుమతులు లేకుండా సమావేశం నిర్వహించి వ్యక్తిగత దూషణలు చేసిన  పుచ్చకాయల కమలాకర్​, బత్తిని సీతారాములు, చాగంటి అశ్వద్దామ, నూర్​ శంశుద్దీన్​, షేక్​ జిలాని పై కేసు నమోదు చేశామన్నారు..

ఎంసీసీ అధికారి దారేడు గ్రామంలో విచారించిన అనంతరం వీడియోతో పాటు అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సీఐ మాట్లాడుతూ... రాజకీయ పార్టీల నాయకులు వ్యక్తిగత దూషణలను చేసినా, ఆర్​వో పర్మిషన్ లేకుండా మీటింగ్ పెట్టినా, మైకులు వాడినా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. వాహనాలు, మీటింగ్​లు, మైకులు, ర్యాలీలలకు ముందుగా  రిటర్నింగ్ ఆఫీసర్  (ఆర్ వో) పర్మిషన్ తీసుకోవాలని సూచించారు.  
 
ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి కారులో సోదాలు

  ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ లో పోలీసులు శనివారం ఎన్నికల తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. ఖమ్మం సూర్యాపేట రహదారిలో కార్లు, బస్సులను ఆపి తనిఖీ చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కారు రావడంతో ఆయన కారును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన కారులో నుంచి దిగి పోలీసులకు సహకరించారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తనిఖీలు చేయాలని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రసాదరావు, ఏసీబీ బస్వా రెడ్డి, సీఐ రాజిరెడ్డి, కానిస్టేబుల్ పాల్గొన్నారు.