Anchor Swecha: యాంకర్ స్వేచ్ఛ మృతిపై కేసు నమోదు.. పరారీలో పూర్ణచందర్

Anchor Swecha: యాంకర్ స్వేచ్ఛ మృతిపై కేసు నమోదు.. పరారీలో పూర్ణచందర్

హైదరాబాద్: యాంకర్ స్వేచ్ఛ మృతిపై కేసు నమోదు అయ్యింది. తన కూతురు మృతికి పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమంటూ స్వేచ్ఛ తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీస్‎లకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ పేరెంట్స్ ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్వేచ్ఛ మృతికి కారణమంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణ చందర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. 

ప్రముఖ తెలుగు యాంకర్ స్వేచ్ఛ శుక్రవారం (జూన్ 27) రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. జవహర్ నగర్‎లోని తన నివాసంలో ఉరి వేసుకుని చనిపోయింది. పోస్ట్ మార్టం నిమిత్తం స్వేచ్ఛ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, వివిధ ప్రజా సంఘాల నేతలు, జర్నలిస్టులు గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గాంధీ ఆసుపత్రి దగ్గర భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

మార్చురీలో విగతజీవిగా పడి ఉన్న స్వేచ్ఛ మృతదేహాన్ని చూసి ఆమె తండ్రి శంకర్రావు బోరున విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని రాంనగర్‎ పార్సీగుట్టలోని స్వేచ్ఛ నివాసానికి తరలించనున్నారు. పార్సీగుట్ట స్మశాన వాటికలో స్వేచ్ఛ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులు, రచయితలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.