ఆర్టీసీ కార్మికులపై కేసులు

ఆర్టీసీ కార్మికులపై కేసులు

వెలుగు నెట్‌వర్క్: వివిధ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిపో  పరిధిలో ఆందోళన చేపట్టిన  ఐదుగురు కార్మిక సంఘాల నాయకులు ఆర్​ సుధాకర్(డ్రైవర్​), ఎం రవీందర్(డ్రైవర్​)​,  ఎండీ మౌలానా(మెకానిక్​), బొల్లం రాకేష్ ఖన్నా(కండక్టర్​), భూక్య నాయక్(డ్రైవర్​)  పై పోలీసులు నాన్ బెయిలబుల్​ కేసులు నమోదు చేశారు.  ప్రస్తుతం వీరంతా ఆరు రోజులుగా  కరీంనగర్ జైలులో మగ్గుతున్నారు.  బుధవారం వీరు పెట్టుకున్న బెయిల్ ఫిటిషన్​ను కొట్టివేసిన న్యాయస్థానం శనివారం లోపు దాఖలు చేసుకోవచ్చని సూచించింది. సమ్మెలో భాగంగా  జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్​– జగిత్యాల రహదారిపై  బుధవారం ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్​ దిష్టిబొమ్మ దహనం చేశారు.

వీరికి మద్దతుగా పీడీఎస్​యూ, పౌరహక్కుల సంఘం, కాంగ్రెస్​ నాయకులు తరలివచ్చారు.144 సెక్షన్​ అమలులో ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేశారంటూ 22 మంది కార్మికులు, పలు సంఘాల నాయకులపై  పోలీసులు కేసు నమోదు చేశారు. వీరందరిపై147, 341, 186, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు జగిత్యాల సీఐ జయేష్​ రెడ్డి తెలిపారు.  మంచిర్యాల జిల్లాలో 50 మంది ఆర్టీసీ కార్మికులపై పోలీసులు సీఆర్పీసీ 151 సెక్షన్ కింద కేసులు నమోదుచేశారు.   సమ్మె ప్రారంభం రోజు బస్సు సైడ్ అద్దం పగులగొట్టాడనే ఆరోపణలతో రమేశ్ అనే కండక్టర్​పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేస్ బుక్ చేశారు.