
హైదరాబాద్, వెలుగు: ఫ్రాడ్ కేసులో బ్యాంక్ ఆఫ్ ఇండియా సరూర్ నగర్ బ్రాంచ్ మాజీ మేనేజర్ కు సీబీఐ స్పెషల్ కోర్టు ఐదేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.60 వేల జరిమానా విధించింది. ఇదే కేసులో మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు కూడా ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేల ఫైన్ విధిస్తూ తీర్పు చెప్పింది. గతంలో సరూర్ నగర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ గా ఉన్న ఏ.గదాధర్.. పండంటి రాజశేఖర్, గడ్డిగోపుల సత్యానందరావుకు హోమ్ లోన్స్ మంజూరు చేశారు.
వారు లోన్ బకాయిలను సరిగ్గా చెల్లించలేదు. దాంతో ఇద్దరి ఖాతాలను బ్యాంకు అధికారులు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్( ఎన్పీఏ) కింద పరిగణించారు. ఈ క్రమంలో లోన్లకు సంబంధించి రాజశేఖర్, సత్యానందరావు వద్ద మేనేజర్ గదాధర్ సరైన డ్యాక్యుమెంట్స్ తీసుకోలేదని నిర్ధారించారు. దీని ద్వారా బ్యాంకుకు రూ. 73.80 లక్షలు నష్టం వాటిల్లిందని గుర్తించారు. మేనేజర్ తో పాటు హోమ్ లోన్స్ తీసుకున్న ఇద్దరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. తాజాగా కోర్టు తీర్పు వెల్లడించింది.