158 కోట్ల స్కామ్ కేసులో సన్ పరివార్ ఉపాధి గ్రూప్పై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి చార్జీషీటును ఈడీ సమర్పించింది. పుడమి ఆగ్రో, పుడమి ఇన్ఫ్రా, డివైన్ ఇన్ఫ్రా పేర్లతో కొత్త పొంజీ స్కీమ్లు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది.
హైదరాబాద్ లో సంచలనం రేపిన 158కోట్ల సన్ పరివార్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మురం చేసింది. మంగళవారం( డిసెంబర్ 23) మనీలాండరింగ్ పై దర్యాప్తు చేసిన ఈడీ.. హైదరాబాద్ లోని మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టులో చార్జీ షీటు దాఖలు చేసింది.
2018లో నార్సింగ్ పీఎస్ పరిధిలో వెలుగు చూసిన ఈ కేసులో దాదాపు 10వేలమంది నుంచి రూ.158 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. మెతుకు రవీందర్ అనే వ్యక్తి సన్ పరివార్ పేరుతో సంస్థను స్థాపించి తెలంగాణ , ఏపీలలో బ్రాంచ్ లను ఏర్పాటు చేసి అమాయకులనుంచి రూ.158 కోట్ల రూపాయలు వసూలు చేశారని, అధిక వడ్డీల ఆశచూపి బాధితులనుంచి డిపాజిట్లు వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు తెలిపింది.
►ALSO READ | హైదరాబాద్ లోని రైతు బజార్లలో ఫుడ్ సేఫ్టీ అవగాహన సదస్సులు.. రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు కూడా అక్కడే..
పుడమి ఆగ్రో, పుడమి ఇన్ఫ్రా, డివైన్ ఇన్ఫ్రా పేర్లతో చిట్ ఫండ్, వెంచర్స్, నిధి, హెర్బల్, మెడికల్ సంస్థలు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడినట్టు గుర్తించింది.
డిపాజిటర్ల డబ్బులు మళ్లించి స్థిరాస్తులు, చరాస్తులు కొనుగోలు చేసి స్వప్రయోజనాలకు వినియోగించినట్లు చార్జీషీటులో కోర్టుకు తెలిపింది. రవీందర్ కుటుంబంతో కలిసి రూ. 26 కోట్లు సొంతానికి వాడుకున్నారని, ఈ కేసులో రూ. 25.25 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలిపింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది ఈడీ స్పష్టం చేసింది.
