- టపాసులు కాల్చి.. మిఠాయిలు పంచి.. కేసీఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకం
హైదరాబాద్: ఉద్యోగ నియామకాలకు ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్లు ఇస్తుననామని.. ఉద్యోగాల భర్తీలో సమూల మార్పులు తీసుకొస్తామని అసెంబ్లీ లో కేసీఆర్ చేసిన ప్రకటనకు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు ప్రారంభించాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచారు. తెలంగాణ భవన్ వద్ద ఖైరతబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యం లో సంబరాలు మిన్నంటాయి. టపాకాయలు కాల్చి.. మిఠాయిలు పంచి పెట్టారు. ఈ సంబరాలలో టిఆర్ఎస్ కార్యకర్తలు, కెసీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
డ్యాన్స్ చేసిన దానం నాగేందర్
కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేస్తే ఎమ్మెల్యే దానం నాగేందర్ డ్యాన్స్ చేశారు. డప్పు చప్పులు, కార్యకర్తలు, అభిమానుల కేరింతలతో పట్టరాని సంతోషానికి లోనై డ్యాన్సు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికించాల్సిన రోజు ఇది అన్నారు. ఉద్యోగులను కాంగ్రెస్ బిజెపిలు ఉసిగొల్పాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్కుడు కేసీఆర్ గారిపై అనవసర కామెంట్స్ చేసారని అన్నారు. బండి సంజయ్ నువ్వు ముందు మాటలు నేర్చుకో... జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, ముఖ్య మంత్రిపై అనవసర కామెంట్స్ చేయడం సరికాదన్నారు.
ఓయూలో విద్యార్థుల సంబరాలు
కేసీఆర్ ఉద్యోగ ప్రకటనను స్వాగతిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. ఆర్ట్స్ కళాశాల వద్ద టపాసులు కాల్చి,, మిఠాయిలు పంచుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ అసెంబ్లీ ప్రకటన కోసం ఉదయం నుంచి విద్యార్థి సంఘాల నాయకులు ఉత్కంఠగా ఎదురు చూశారు. పెద్ద తెర (ఎల్ ఈడీ స్క్రీన్) ఏర్పాటు చేయగా.. అనుమతి లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకటనపై వ్యతిరేకంగా నిరసనలకు దిగుతారన్న అనుమానంతో ఎల్ ఈడీ తొలగించారు. ఓ వైపు వాగ్వాదం జరుగుతుండగానే.. తొలగించారు. ఈలోపే కేసీఆర్ ప్రకటన వచ్చేసింది. దీంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ.. టీఆర్ఎస్ అనుంబంధ విద్యార్థి సంఘాల నాయకులు టపాకాయలు కాల్చి.. మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ జిందాాబాద్ అంటూ నినాదాలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఊర్లలో సంబరాలు
కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటనను స్వాగతిస్తూ టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడ కేసీఆర్ చిత్రపటాలను పట్టుకుని రోడ్డుపైకి వచ్చి టపాసులు కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు.
కరీంనగర్: అసెంబ్లీలో సీఎం ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటనతో కరీంనగర్ తెలంగాణ చౌక్లో టీఆర్ఎస్, టిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. హుజురాబాద్ లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్.