హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఏప్రిల్ 29వ తేది శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొచ్చి వాన పడింది. దీంతో రంగారెడ్డి జిల్లా నీటితో మునిగిపోయింది. అపార్ట్మెంట్ సెల్లార్లు నీటమునిగాయి. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీ రోడ్డు నెంబర్ 10 వద్ద పలు అపార్ట్మెంట్ సెల్లార్లలో వరద నీరు భారీగా వచ్చి చేరింది.
మోటర్ల సహాయంతో అపార్ట్మెంట్ వాసులు నీటిని తోడుతున్నారు. ఫలితంగా అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు నగరంలోని ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి పలు కాలనీకు రాకపోకలు నిలిచిపోయయాయి. కుండపోత వర్షానికి రోడ్డుపై నాలాలు వరదలా ప్రవహించింది. వరదలో చెత్తాచెదారం భారీగా కొట్టుకొచ్చింది.
వరదలో కొట్టుకుపోయిన వాహనాలు
భారీ వరద నగరంలోని రహదారులపైకి రావడంతో పలు ప్రాంతాల్లో వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, బేగంపేట్, యూసుఫ్గూడ, షేక్పేట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఆర్సీపురం, రాజేంద్రనగర్, బండ్లగూడ, గొల్కొండ, నార్సింగి, పుప్పాలగూడ, మైలార్ దేవులపల్లి, మణికొండ, గండిపేట, షాద్నగర్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రోడ్లన్ని జలమయం
నగరంలో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమైయ్యాయి. ఉదయంపూట ఎటు చూసిన వరదనీరే కనిపించింది. రోడ్లన్నీ నదులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలు కొన్ని చోట్ల ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నగరవాసులంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.